నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ (Indian PM Narendra Modi) పుట్టిన రోజు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలో వన్యప్రాణులను ప్రోత్సహించడం కోసం నమీబియా (Namibia) నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన చిరుత (Chhetahs)లను మధ్యప్రదేశ్ నేషనల్ పార్క్లో తన పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ విడిచిపెట్టనున్నారు. అలాగే మహిళా స్వయం సహాయక బృందాలతోనే భేటీ కానున్నారు. వీటితో పాటు అనేక కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. మోదీ భారత ప్రధానిగా 2014లో బాధ్యతలు చేపట్టారు. దాదాపు 8 ఏళ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన హయాంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలను ఇప్పుడు పరిశీలిద్దాం.
* మాడిసన్ స్క్వేర్
నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత 2014లో అమెరికాలో పర్యటించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో సెప్టెంబర్ 28న మోదీ ప్రసంగించారు. భారతదేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భారతీయ-అమెరికన్లు, యూఎస్ ప్రముఖులను కోరారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మోదీ హిందీలో ప్రసంగించడం గమనార్హం.
* డీమోనిటైజేషన్
2016, నవంబర్ 8న రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో యావత్ దేశం ఆశ్చర్యానికి గురైంది. రద్దైన నోట్ల స్థానంలో ప్రభుత్వం రూ. 500, రూ.2000 విలువైన కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది. దేశంలో నల్ల ధనాన్ని అరికట్టడం కోసం డీమానిటైజేషన్ను చేపట్టినట్లు ప్రధాని వివరించారు.
* ఆర్టికల్ 370 రద్దు
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ మోదీ సర్కార్ 2019, ఆగస్టు 5న సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 35-ఏ నిబంధనలు కూడా పూర్తిగా రద్దు చేశారు. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ & కాశ్మీర్, లడఖ్ గా విభజించారు.
* టీకా మైలురాయి
కరోనా సమయంలో ప్రపంచం మొత్తం అల్లాడుతుంటే, భారత్ మాత్రం ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంది. కరోనాపై పోరులో టీకాల పంపిణీని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టింది. 2021, అక్టోబర్ 21 నాటికి దేశంలో టీకాల పంపిణీ 100 కోట్ల మార్కును అధిగమించింది.
* హౌడీ మోడీ..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధాని మోదీ 2019లో రెండోసారి అమెరికాలో పర్యటించారు. సెప్టెంబర్ 22న, హౌడీ మోడీ పేరుతో భారీ సభ జరిగింది. 50,000 మంది కంటే ఎక్కువ మంది ఈ సభకు హజరయ్యారు.
* నమస్తే ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2020, ఫిబ్రవరి 24న అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ పేరుతో భారీ సభను నిర్వహించింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతేరాలో నమస్తే ట్రంప్ ప్రోగ్రామ్లో దాదాపు లక్ష మంది పాల్గొన్నారు.
* ఇస్రో చీఫ్కు ధైర్యం చెప్పిన వేళ
2019, సెప్టెంబర్ 7 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టింది. చంద్రుడి మీదకు ప్రయోగించిన విక్రమ్ వ్యోమనౌకకు చెందిన ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. ఇస్రో గ్రౌండ్ స్టేషన్తో దాని సంబంధాలు తెగిపోయాయి. దీంతో చంద్రయాన్ -2 ప్రయోగం విఫలమైంది. ఈ సందర్భంగా ఇస్రో చీఫ్ కె.శివన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రధాని మోదీ శివన్ను అక్కున చేర్చుకుని హత్తుకుని ధైర్యం చెప్పారు.
* మ్యాన్ VS వైల్డ్
డిస్కవరీ ఛానల్లో ప్రసారం అవుతున్న మ్యాన్ VS వైల్డ్ ప్రోగ్రామ్కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రముఖ సర్వైవలిస్ట్ బేర్ గ్రిల్స్తో కలిసి ప్రధాని మోదీ ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ఓ ఎపిసోడ్లో పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra Modi Birthday, National News, PM Narendra Modi