పార్లమెంట్ క్యాంటీన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ అన్ని అహార పదార్థాలు చాలా చౌకగా లభిస్తుంటాయి. టీ నుంచి బిర్యానీ వరకు.. ఏది తిన్నా అంతే. చాలా తక్కువ రేటు ఉంటుంది. క్వాలిటీ మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లా ఉంటుంది. తక్కువ ధరకే లభించే ఆ నాణ్యమైన భోజనాన్ని పార్లమెంట్ సిబ్బంది, జర్నలిస్టులు, అతిథులు, ఎంపీలకు వడ్డిస్తారు. కానీ ఇక నుంచి ఆ ఛాన్స్ లేదు. పార్లమెంట్ క్యాంటిన్లో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవలే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఫుడ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. అంతేకాదు క్యాంటిన్ నిర్వహణ బాధ్యతల నుంచి నార్తర్న్ రైల్వేస్ (ఉత్తర రైల్వే)ను తప్పించి.. ITDC (ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్)కు అప్పగించారు.
ఇవాళ్టి నుంచి పార్లమెంట్ క్యాంటిన్ను ITDC నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 58 పదార్థాలతో కూడిన మెనూను, వాటి రేట్ల వివరాలను విడుదల చేసింది. అన్ని పదార్థాల రేట్లు భారీగా పెరిగాయి. ఇంతకు ముందు రూ.60 ఉన్న వెజ్ తాలి ఇప్పుడు 100 రూపాయలకు చేరింది. టీ రూ.5, కాఫీ రూ.10, లెమన్ టీ రూ.14కి అమ్ముతున్నారు. ఇక నుంచి వెజ్ బిర్యానీ రూ.50, చికెన్ బిర్యానీ రూ. 100, మటన్ బిర్యానీ రూ.150కి లభిస్తాయి. వెజ్ బఫేకు రూ.500, నాన్ వెజ్ బఫేకు రూ.700 చెల్లించాల్సిందే.
కొత్త ధరల వివరాలు:
పార్లమెంట్లోని క్యాంటిన్లోని ఆహార పదార్థాలపై ఎంపీలు, సిబ్బందికి 80శాతం సబ్సిడీ ఉండేది. ఆహార పదార్థాలపై ఏటా రూ.17 కోట్లు ఖర్చవుతుండగా.. వీటిలో దాదాపు రూ.14 కోట్లను పార్లమెంట్ సిబ్బంది, సందర్శకులే వినియోగించుకుంటున్నారు. ఎంపీలు తక్కువ మొత్తంలో వినియోగించుకున్నారు. అంతేకాదు చివరగా 2016లో మెనూ ధరలను సవరించారు. కోటాను కోట్ల ఆస్తులుండే ఎంపీలకు అతి తక్కువ ధరకే సబ్సిడీపై ఆహారం అందించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ క్యాంటిన్లో ఆహార పదార్థాలపై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Indian parliament, Parliament