కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై 15 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చట్టాలను రద్దు చేస్తూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని రైతులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇవి రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఈ చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులు, మల్టీ నేషనల్ కంపెనీలకు రైతులు దాసోహం అయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతు మార్కెట్ కమిటీ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోతుందని, రైతులకు కనీస ధర లభించే కమిటీలు నిర్వీర్యం అయిపోతే అప్పుడు అన్నదాతలకు నష్టం వాటిల్లుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను సమగ్ర చర్చ జరపకుండానే పార్లమెంట్లో ఆమోదించిందని రైతులు ఆమోదించారు. దీని వల్ల ఎదురయ్యే కష్టనష్టాల గురించి కనీసం చర్చ జరగలేదని తమ పిటిషన్లో రైతులు ఆరోపించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్టాలను యధావిధిగా అమలు చేస్తే దేశంలో వ్యవసాయం చేసే రైతులకు తీవ్రంగా నష్టం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ను కాదని, సమాంతర మార్కెట్ను ఏర్పాటు చేస్తే అది భారతీయ రైతుల మీద పెను ప్రభావం చూపుతుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers Protest, Supreme Court