‘ప్రజల్ని భయపెట్టడానికో లేదా వారిని ఆందోళనకు గురిచేయడానికో నేనీ మాటలు చెప్పట్లేదు. కానీ బాధ్యత గల ప్రభుత్వ నిపుణిడిగా వాస్తవాలను జనం ముందుకు తీసుకెళ్లడమే నా ఉద్దేశం. నేను చెప్పే విషయాల్లో కొన్ని పాజిటివ్, ఇంకొన్ని నెగటివ్ అంశాలున్నాయి..’ అంటూ మొదలుపెట్టారు ఇండియా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ సైంటిఫిక్ అడ్వైజర్ కమిటీ చైర్పర్సన్, అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ జయప్రకాశ్ ముల్లియుల్. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ ఒమిక్రాన్ను ఆపడం ఎవరి తరం కాదని, దీని బారిన ప్రతి ఒక్కరూ పడాల్సిందేనని, ఏ బూస్టర్ డోసు కూడా వైరస్ వ్యాప్తి ఉధృతిని నిలువరించలేదని ఆయన స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ నుంచి బూస్టర్ డోసు రక్షణగా నిలుస్తుందనే గ్యారంటీ ఏమీ లేదని, బూస్టర్ తీసుకున్నా పెద్ద తేడా ఉండదని, ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ కు గురికాకుండా ఒక్కరు కూడా మిగలరని, ప్రపంచ వ్యాప్తంగా ఇదే జరుగుతోందని వైరస్ నిపుణుడు డాక్టర్ జయప్రకాశ్ తెలిపారు. కరోనాపై ఇక ఏమాత్రం భయపెట్టలేదని, కొత్త వేరియంట్ చిన్న పాటి లక్షణాలుంటాయని, ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు తక్కువని అన్నారు. అయితే, కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం ఆస్పత్రిలో చేరికలు పెరుగుతాయని చెప్పడంపై ఆయన స్పందించలేదు.
కరోనా ఒమిక్రాన్ వైరస్ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొగలదని డాక్టర్ జయప్రకాశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. డెల్టాతో పోల్చుకుంటే ఒమిక్రాన్ అంత ప్రమాదకరమేమీ కాదని, అయితే ఇది సోకకుండా ఆపడం ఎవరి వల్ల కాదని తెలిపారు. ఇన్ఫెక్షన్ ద్వారా ఏర్పడ్డ సహజ ఇమ్యునిటీ జీవితాంతం ఉంటుందని, దీని వల్లే ఇతర దేశాల్లా .. భారత్ తీవ్రంగా ప్రభావితం కావడం లేదని అన్నారు.
వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకముందే దేశంలోని 85 శాతం మంది ప్రజలకు కరోనా మహమ్మారి సోకిందని, తొలి డోసే.. బూస్టర్ డోసని డాక్టర్ జయప్రకాశ్ చెప్పారు. ఏ వైద్య సంస్థలు బూస్టర్ డోసులను ఇవ్వాలని సూచించలేదని ఎత్తి చూపుతూ.. మహమ్మారి వ్యాప్తిని ఎవరు ఆపలేరని తెలిపారు. వైరస్ వ్యాప్తి గురించి చెబుతూ.. ఈ వేరియంట్ రెండు రోజుల్లోనే ఇన్ఫెక్షన్ని రెట్టింపు చేస్తుందని, పరీక్ష ఒమిక్రాన్ను గుర్తించక ముందే.. సోకిన వ్యక్తిన కారణంగా పెద్ద సంఖ్యలో ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు.
కాగా, కేంద్రం యుద్ధప్రాతిపదికన బూస్టర్ డోసులను పంపిణీ చేస్తోన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, బూస్టర్ డోసు గురించి సూచించలేదని, ముందస్తు జాగ్రత్తగా ప్రికాషన్ డోసు సూచించామని, ఎందుకంటే 60 ఏళ్లకు పైబడిన వారికి రెండు డోసులు పనిచేయడం లేదని జయప్రకాశ్ తెలిపారు. మనలో చాలా మందికి కరోనా వేరియంట్ సోకినట్లు తెలియదని, 80 శాతానికి పైగా ప్రజలకు.. ఆ విషయం తెలియకపోవచ్చునని ఆయన పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.