EUROPE VISIT COMES AT CHALLENGING TIMES SAYS PM MODI EUROPE TOUR FROM MAY 2ND 65 HOURS 25 MEETINGS WITH 8 WORLD LEADERS MKS
PM Modi: యుద్ద కల్లోలం వేళ యూరప్కు మోదీ.. 65 గంటల్లో 25 భేటీలు.. ఇంధన భద్రతే ప్రధానాంశం
ప్రధాని మోదీ
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కారణంగా యూరప్ అల్లకల్లోలంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించనున్నారు. 65గంటల వ్యవధిలో 25 సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. 7దేశాల 8మంది నేతలను కలుస్తారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కారణంగా యూరప్ అల్లకల్లోలంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించనున్నారు. సోమవారం నుంచి మొదలయ్యే మోదీ యూరప్ టూర్ 65గంటలపాటు నిర్విరామంగా సాగనుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది ముఖ్య అధినేతలతో మొత్తం 25 సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. ఇంధన భద్రతతోపాటు యుద్ధనివారణా ఆయన పర్యటనలో ప్రధానాంశాలు కానున్నాయి. పర్యటనకు బయలుదేరే ముందు ఆదివారం సాయంత్రం ప్రధాని తన ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు..
ఉక్రెయిన్లో భీకర యుద్ధం జరుగుతోన్న వేళ యూరప్ దేశాల పర్యటనకు శ్రీకాంచుట్టారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆదివారం సాయంత్రం జర్మనీ బయలుదేరడానికి ముందు తన పర్యటనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ తాను యూరప్లో పర్యటిస్తున్నానన్నారు. యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. శాంతి, శ్రేయస్సును కోరుకునే భారత్కు ఆయా దేశాలు ఎంతో ముఖ్యమైన భాగస్వామ్యపక్షాలు అని మోదీ అభిప్రాయపడ్డారు.
మూడు రోజులపాటు సాగే మోదీ యూరప్ పర్యటనలో ఇంధన భద్రతే ప్రధానాంశమని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. వివిధ దేశాధిపతులతో మోదీ సంప్రదింపులు జరుపుతారని, ద్వైపాక్షిక చర్చలపైనే విస్తృతంగా దృష్టి సారించినప్పటికీ ఉక్రెయిన్లో యుద్ధ పరిస్థితులు కూడా చర్చకు వస్తాయని పేర్కొన్నారు. మారిన భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రతకు మరింత ప్రాధాన్యం ఏర్పడినందున ప్రధాని మోదీ చర్చల్లో ఈ అంశం ప్రధానంగా ఉంటుందని విదేశాంగ శాఖ అధికారి వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని అవలంబిస్తోందని, ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్లు ఆయన గుర్తుచేశారు.
మోదీ పర్యటనలో ముందుగా మే 2న జర్మనీ వెళ్తారు. బెర్లిన్లో జర్మన్ ఛాన్సలర్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు కలిసి ఇండియా-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)కి సహాధ్యక్షత వహిస్తారు. భారత్, జర్మనీ మంత్రులు కూడా విడిగా సమావేశమవుతారు. మే 3న మోదీ డెన్మార్క్ లోని కోపెన్హాగన్లో పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండియా-నోర్డిక్ రెండో సదస్సులో ఆయన పాల్గొంటారు. ఐస్లాండ్ ప్రధాన మంత్రి కట్రిన్ జాకబ్స్డొట్టిర్, నార్వే పీఎం జోనాస్ గహ్ర్ స్టోర్, స్వీడర్ పీఎం మగ్ధలీనా ఆండర్సన్, ఫిన్లాండ్ ప్రధాని సన్న మారిన్లతో కూడా చర్చలు జరుపుతారు. ఇండియా-డెన్మార్క్ బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొంటారు. డెన్మార్క్లోని భారత సంతతి ప్రజలను కూడా మోదీ కలుస్తారు.
మే 4న భారత్ తిరిగి రావడానికి ముందు ప్రధాని మోదీ ఫ్రాన్స్లో కాసేపు పర్యటిస్తారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో మేక్రన్ విజయం సాధించారు. ఈ ఫలితాలు వెలువడిన పది రోజుల్లోనే తాను ఫ్రాన్స్లో పర్యటించబోతున్నానని, మేక్రన్ను వ్యక్తిగతంగా అభినందించే అవకాశం లభించిందని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత మైత్రి బలపడటానికి తన పర్యటన దోహదపడుతుందన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.