ద్రౌపది ముర్ము (Draupadi Murmu).. కొద్ది గంటలుగా ఈ పేరు ట్రాప్ ట్రెండింగ్ లో నిలిచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అత్యంత వ్యూహాత్మకంగా గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా (Presidential Elections 2022) ప్రకటించింది. అర డజనుకుపైగా రాష్ట్రాల్లో గిరిజన ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండటం, మహిళా సెంటిమెంట్ కూడా 2024 ఎన్నికల్లో కలిసొస్తుందనే బీజేపీ ఆమెను ఎంచుకుందనే రాజకీయ వాదనలు పక్కనపెడితే, నిజంగానే ద్రౌపది ముర్ము ఎదుగుదల భారత ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పాఠానికి తక్కువేమీ కాదు. రాజకీయంగా ఉజ్వల జ్యోతిలా వెలుగుతున్నప్పటికీ.. ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం అత్యంత విషాదభరితం. అన్నీ తట్టుకొని నిలబిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు..
అధికార ఎన్డీఏ కూటమి తమ రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్ము పేరును ప్రకటించినప్పటి ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించి ఇంటర్నెట్ లో సెర్చింగ్ జరుగుతోంది. అన్నీ అనుకూలిస్తే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యే తొలి గిరిజన మహిళగా ద్రౌపది చరిత్రసృష్టిస్తారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఆమె 25 ఏళ్ల కెరీర్ లో.. రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగారు.
చాలా రకాలుగా వెనుకబడిన ఒడిస్సా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన మయూర్భంజ్(పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దుల్లో ఉంటుది) జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న గిరిజన కుటుంబంలో జన్మించారు ద్రౌపది ముర్ము. వీరిది గిరిజన వర్గంలోని సంథాల్ తెగ. పేదరికపు అడ్డంకులను అధిగమిస్తూ విద్యాభ్యాసం సాగించిన ద్రౌపది.. భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ చదివారు. ఆర్ట్స్ విద్యార్థి అయిన ముర్ము.. సాగునీటి-విద్యుత్తు శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేశారు. రాయ్రంగాపూర్లోని శ్రీ అరబిందో సమీకృత విద్యా కేంద్రంలో స్వచ్ఛందంగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.
చదువుకున్న వ్యక్తిగా తన గిరిజనం బాగు కోసం తపించే ద్రౌపది ముర్ము తొలిసారి బీజేపీ తరఫున 1997లో రాయ్రంగ్పూర్ నగర పంచాయతీ కౌన్సిలర్గా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2000 సంవత్సరంలో రాయ్రంగ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజూ జనతాదళ్ (బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్య వాణిజ్య, రవాణా, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఒడిస్సాలో ఉత్తమ పనితీరు కనబరిచే ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును 2007లో అందుకున్నారు. 2004లో రెండోసారి ఎన్నికయ్యారు.
పార్టీపరంగా బీజేపీ ఒడిస్సా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలు, అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2010, 2013లో రెండుసార్లు మయూర్భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ముర్మును బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమించారు. మయూర్భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే.. 2015 మే 18న జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2021 జూన్ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. జార్ఖండ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు. త్వరలో ఆమె బద్దలుకొట్టనున్న రికార్డులు ఏవంటే..
ప్రస్తుతం ఉన్న బలాబలాలు, ఎన్డీఏకు లభించిన మద్దతును బట్టి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా విజయం సాధించే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే పలు ఘనతలు ఆమె ఖాతాలో చేరనున్నాయి. తొలి గిరిజన, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగానే కాక.. స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతి ఈమెనే కానున్నారు. ఇప్పటివరకు భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వారంతా 1947కు ముందు జన్మించినవారే. ఇదిలా ఉంటే,
ద్రౌపది ముర్ము రాజకీయ జీవితం ఉజ్జ్వలంగానే సాగినా.. వ్యక్తిగత జీవితం మాత్రం విషాదభరితం. ముర్ము భర్త శ్యాంచరణ్ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే, ద్రౌపది భర్త శ్యాంచరణ్ తోపాటు ఇద్దరు కుమారులు గతంలోనే చనిపోయారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే అన్నీ. కూతురుకు వివాహమై ఒక పాప కూడా ఉంది. తీరిక చిక్కినప్పుడల్లా చిన్నారి మనవరాలితో ఆడుకుంటారు ద్రౌపది ముర్ము. ప్రస్తుతం ఆమె వయసు 64 ఏళ్లు. మొన్న జూన్ 20న పుట్టినరోజు జరుపుకొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Draupadi Murmu, Odisha, President Elections 2022, President of India