దేశంలో మంకీపాక్స్ (monkey pox) వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే కరోనా ఫోర్త్ వేవ్ కు ప్రపంచ దేశాలు హడలేత్తిపోతున్నాయి. ఇప్పటికి అనేక దేశాల్లో కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. అనేక దేశాలు.. కరోనా ధాటికి విలవిల్లాడిపోయాయి. ఈ క్రమంలో.. మంకీపాక్స్ కేసులు క్రమంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే కేరళలో (kerala) మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, ఢిల్లీలో మంకీపాక్స్ తొలికేసు వెలుగులోనికి వచ్చింది. కాగా, 31 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్ సింప్టమ్స్ ఉన్నట్లు బయటపడింది. దీంతో అధికారులు అతడిని ప్రత్యేకంగా క్వారంటైన్ లో ఉంచారు. సదరు వ్యక్తి.. హిమాచల్ ప్రదేశ్ లో ఒక పార్టీకి హజరైనట్లు తెలుస్తోంది.
పశ్చిమ ఢిల్లీ (Delhi) నివాసి మూడు రోజుల క్రితం వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అతని నమూనాలను నిన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు తెలిపింది. అతను ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. ముంబైలో ప్రతి వారం రెండు-మూడు అనుమానిత నమూనాలు టెస్ట్ ల కోసం ల్యాబ్ కు పంపుతున్నారు. అయితే ఈ రోజుల్లో ఫ్రీక్వెన్సీ రోజుకు రెండు-మూడుకి పెరిగిందని సమాచారం. దేశంలో ప్రస్తుతం.. 16 ల్యాబొరేటరీలు మంకీపాక్స్ కోసం అంకితం చేయబడ్డాయి. ఇందులో కేరళకు మాత్రమే రెండు ఉన్నాయి. దీనితో ఇప్పటికి దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
మంకీపాక్స్ అనేది జూనోటిక్ వైరస్, ఇది మశూచిని పోలి ఉంటుంది. కానీ తక్కువ తీవ్రతతో ఉంటుంది. వైరస్ సోకిన జంతువుల నుండి మానవులకు ప్రత్యక్ష లేదా పరోక్ష సంక్రమణ ద్వారా వ్యాపిస్తుంది. ఇది సోకిన వ్యక్తి చర్మం లేదా గాయాలు మరియు శ్వాసకోశ బిందువులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవుల నుండి మానవులకు కూడా సంక్రమిస్తుంది. ఇప్పటివరకు, ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికాలో ఐదు మరణాలు కూడా నమోదయ్యాయి. భారతదేశం కాకుండా, WHO యొక్క ఆగ్నేయాసియా ప్రాంతం నుండి - థాయ్లాండ్లో ఒకే ఒక్క కేసు నమోదైంది.
ఇక, లేటెస్ట్ గా మంకీపాక్స్వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)గా ప్రకటించింది. 75 దేశాల్లో 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అలాగే.. ఈ వ్యాధితో ఐదుగురు మరణించినట్లు తెలిపారు. సాధారణంగా ఈ వ్యాధి కనిపించని బ్రిటన్లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. జూన్ చివరి వారం నుంచి జులై మొదటివారం వరకు ఈ వైరస్ విస్తరణ వేగం 77 శాతానికి పెరిగింది.
గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించడం ద్వారా గణనీయస్థాయిలో ప్రభావం కలిగించే ముప్పుగా మంకీపాక్స్ ను డబ్ల్యూహెచ్ఓ పరిగణిస్తుంది. తద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం కోరే వీలుంటుంది. యూరప్ దేశాలను ఈ కొత్త వైరస్ కు జన్మస్థానంగా భావిస్తున్నారు. స్వలింగ సంపర్కుల్లో ఇది అత్యంత ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.