Pay Per Road Use: ఢిల్లీ, గుర్గావ్ నగరాలను కలుపుతూ ప్రభుత్వం నిర్మించిన ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్ప్రెస్ వేపై(Delhi-Gurgaon Expressway) ‘పే పర్ రోడ్ యూజ్’ (Pay Per Road Use)టోల్ వసూలు విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. రోడ్డుపై ఎంత దూరం ప్రయాణిస్తే, ఆ మేరకు టోల్ కట్టే సిస్టమ్ ఇది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(National Highways Authority of India) దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది. ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ట్యాక్స్ కలెక్ట్ చేయనున్నారు. తదనంతరం ఈ మార్గాన్ని ‘ఓపెన్ టోల్ రోడ్’ ఎక్స్ప్రెస్ వేగా మార్చనున్నారు.
ఢిల్లీ- గుర్గావ్ ఎక్స్ప్రెస్ వేపై ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ కెమెరా(ANPR)లను ఏర్పాటు చేయనున్నట్లు NHAI అధికారులు వెల్లడించారు. ఎక్స్ప్రెస్ వేపై అన్ని ప్రవేశ, నిష్క్రమణ(ఎంట్రీ, ఎగ్జిట్) ద్వారాల వద్ద ఈ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 29 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వేపై కిలోమీటర్ల ఆధారంగా టోల్ ట్యాక్స్ని లెక్కించి వినియోగదారుల ఫాస్టాగ్ నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటుంది.
టెండర్ ప్రక్రియ షురూ
ఎక్స్ప్రెస్ వేపై ANPR కెమెరాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ మొదలైందని ఎన్హెచ్ఏఐ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో ‘పే పర్ రోడ్ యూజ్’ వ్యవస్థను అమలు చేయనున్నట్లు NHAI సీనియర్ మేనేజర్ ధ్రువ్ గుప్తా వెల్లడించారు. అయితే వాహనాలపై టోల్ శ్లాబు వివరాలు, ప్రాజెక్ట్ డెడ్లైన్ వంటివేవీ నిర్ణయించలేదని చెప్పారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్లు వాహనాల నంబర్లను గుర్తిస్తాయని తెలిపారు. ‘ఒకసారి వాహనదారుడు రోడ్డుపైకి ఎంట్రీ ఇవ్వగానే నంబర్ ప్లేటును కెమెరాలు రీడ్ చేస్తాయి. అనంతరం ఎగ్జిట్ అయ్యాక ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ దానంతట అదే వసూలు చేస్తుంది’ అని ధ్రువ్ గుప్తా స్పష్టం చేశారు.
గదిలో ఏ సైజ్ ఫ్యాన్ అమర్చాలి? పెద్ద లేదా చిన్న ఫ్యాన్ పెట్టడం గాలిని ప్రభావితం చేస్తుందా?
ఖేర్కి- డౌలా టోల్ ప్లాజా ఉండదు..
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక ఖేర్కి- డౌలా టోల్ ప్లాజాను ఎత్తివేయడంపై NHAI నిర్ణయం తీసుకుంటుందని ధ్రువ్ గుప్తా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ట్యాక్స్ చెల్లిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు వాహనాలు బారులు తీరుతున్నాయి. అదే సమయంలో ఫ్యూయెల్ వృథాతో పాటు కాలుష్యం కూడా ఎక్కువవుతోంది. ‘పే పర్ రోడ్ యూజ్’ వ్యవస్థతో వాహనదారులకు ఈ సమస్య తప్పుతుంది. ఈ టోల్ ప్లాజా సగటుగా రోజుకు రూ.50-55 లక్షల ట్యాక్స్ వసూలు చేస్తోంది. నెలకు రూ.15 కోట్ల మేర ఆదాయం పొందుతోందని విశ్వసనీయ సమాచారం.
* గతేడాదే ప్రకటన
ANPR కెమెరాల ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గతేడాదే తీసుకొచ్చారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేపై త్వరలోనే ప్రవేశపెడతామని గతంలో వెల్లడించారు. కాగా, ఢిల్లీ- గుర్గావ్ ఎక్స్ప్రెస్ వేపై డిజిటల్ టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు. కానీ ఈ ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణించే స్థానికులకు మినహాయింపు ఇవ్వాలని సూచిస్తున్నారు. చాలా ప్రాంతాలకు ఇదొక్కటే ప్రధాన మార్గం కావడంతో ఈ మినహాయింపు ఇవ్వాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Toll plaza