ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో శక్తిమంతమైన దేశంగా ఎదిగినా ఇప్పటికీ వరకట్నం, కూతురు కంటే కోడలు తక్కువ లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. కోడళ్లను కేవలం పని మనుషులుగా, పిల్లల్ని కనే యంత్రాలుగా మాత్రమే చూసే అత్తారి ఇళ్లు, ఆడపిల్లల్ని కన్నందుకు శాపాలు, మగ పిల్లాడిని కనివ్వాలని ఒత్తిళ్లు, బలవన్మరణాలు.. లాంటి కేసులు నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాం. అయితే, నిజానికి కుటుంబంలో కూతుళ్ల కంటే కూడా కోడలికి ఎక్కువ హక్కు ఉంటుందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కుటుంబానికి సంబంధించి వారసత్వంగా దక్కే అన్ని విషయాలకూ కోడలు చట్టబద్ధ వారసురాలు అవుతుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కోడలు లేదా విధవరాలైన కోడళ్లను కుటుంబ వారసుల జాబితాలో చేర్చుతూ చట్టాన్ని సవరించాలని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంలో 2019 ఆగస్టు 5న ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేయాలని చెప్పింది.
కోడలికి హక్కుల విషయంలో వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు చట్టాలు ఉండటాన్ని కోర్టు గుర్తించింది. ఉత్తర్ప్రదేశ్ నిత్యవసర వస్తువుల (ఉత్పత్తి, పంపిణీ, ధరల నిర్ధరణ) చట్టం 2016లో ఇంటికి వచ్చే కోడలిని కుటుంబ సభ్యురాలిగా పేర్కొనలేదు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కోడలు కుటుంబంలో సభ్యురాలు కాదని ఆదేశాలిచ్చింది. దీని వల్ల ఇంటికి వచ్చే కోడలు తన హక్కులు కోల్పోతుందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది.
ఈ వ్యవహారాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన తర్వాత.. నిజానికి కన్న కూతురి కంటే కోడలు లేదా విధవరాలైన కోడలికే కుటుంబంలో ఎక్కువ హక్కులు ఉంటాయని అల్హాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇంటికి వచ్చిన కోడలు విధవరాలైనా కాకపోయినా, కూతురు (విడాకులు తీసుకున్నా లేదా విధవరాలైనా) కంటే ఎక్కువ హక్కులు ఉంటాయని హైకోర్టు తెలిపింది.
ఉత్తర్ప్రదేశ్కు చెందిన పుష్పా దేవి అనే మహిళ భర్త చనిపోగా తన అత్త మహాదేవితోనే ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. మహాదేవి పేరు మీద ఓ రేషన్ షాపు ఉండేది. ఇటీవల అత్త మహాదేవి చనిపోగా.. ఆ రేషన్ షాపును తనకు కేటాయించాలని కోడలైన పుష్పా దేవి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. అయితే పుష్పాదేవి.. మహాదేవి వారుసురాలు కాదంటూ 2019, ఆగస్టు 5న ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పేర్కొంటూ ఆమెకు రేషన్ షాపు కేటాయించేందుకు నిరాకరించింది.
ఏ ఆధారమూ లేని తనకు అత్తగారి వారసత్వంగా వచ్చే రేషన్ కార్డు ఒక్కటే దిక్కని, దానిని తనకే ఇప్పించాలని కోరుతూ బాధితురాలు పుష్పాదేవి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. కుటుంబంలో కన్న కూతురి కంటే కోడలికే ఎక్కువ హక్కులు ఉంటాయని, ఆమెకు రేషన్ షాపు కేటాయించాలని ఆదేశాలిచ్చింది. ఇందుకోసం సదరు చట్టంలో మార్పులు చేయాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family dispute, High Court, Uttar pradesh