బురేవి తుపాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. తుపాన్ కారణంగా దక్షిణ తమిళనాడు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తుపాన్ ప్రభావంతో తమిళనాడులో 12 మంది మరణించారు. ఇప్పటికి బురేవి తుపాన్ రామనాథన్ జిల్లా తీరానికి సమీపంలోని గల్ఫ్ ఆఫ్ ప్రాంతంలో కేందీకృతం అయినట్టుగా భారత వాతావరణ శాఖ తెలిపింది. గత 30 గంటలుగా అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతున్నట్టుగా పేర్కొంది. మరో 12 గంటల పాటు బురేవి తుపాన్ అదే ప్రాంతంలో స్థిరంగా ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత అది బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇక, ఇప్పటివకే బురేవి ప్రభావంతో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులోని రామేశ్వరం జిల్లాతోపాటు, పుదుచ్చేరిలలో భారీ వర్షపాతం నమోదైంది.
దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలతో ప్రముఖ చిదంబరం నటరాజ స్వామి ఆలయం జలదిగ్బంధంలో ఉంది. పలుచోట్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నేడు, రేపు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావర శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు బురేవి తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పైనా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తుపాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని భారత వాతావరణ శాఖ శుక్రవారమే సూచించింది. తుపాన్ ప్రభావంతో రామేశ్వరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు తుపాన్ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.