కర్ణాటకలోని ధార్వాడ్ మెడికల్ కాలేజీ (Dharwad Medical College)లో జరిగిన కళాశాల ఈవెంట్ మొత్తం రాష్ట్రాన్నే కుదిపేసింది. కార్యక్రమం అనంతరం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొదటిరోజే దాదాపు 60కిపైగా పాజిటివ్ కేసులు (SDM covid cases) బయటపడ్డాయి. రెండో రోజు ఆ కళాశాలలో కరోనా సోకిన వారి సంఖ్య 182కు పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలేజీలోని మొత్తం సిబ్బంది, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కర్ణాటక, ధార్వాడ్ మెడికల్ కాలేజీలో శనివారం 99 మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, అధ్యాపకులు కరోనా బారిన పడటంతో వీరి సంఖ్య 281కి చేరుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్ ఎస్డీఎం మెడికల్ సైన్స్ కాలేజీ కోవిడ్ క్లస్టర్గా మారిందని తెలిపారు. ‘‘ప్రస్తుతం కరోనా బారిన పడ్డ విద్యార్థులు, అధ్యాపకులు కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమానికి హాజరయ్యారని తెలిసింది. దాని వల్ల ఇన్ని కేసులు (Corona cases) వెలుగు చూశాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు విధించే పరిస్థితిలో లేము. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని సుధాకర్ తెలిపారు.
ప్రస్తుతం మరో 1,822 పరీక్ష ఫలితాలు రావాల్సి ఉన్నందున ఈ సంఖ్య పెరగవచ్చని ధార్వాడ్ జిల్లా కలెక్టర్ నితీష్ పాటిల్ తెలిపారు. 281 మందిలో కేవలం ఆరుగురు రోగులకు మాత్రమే తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ఇతరుల్లో ఎలాంటి లక్షణాలు వెలుగు చూడలేదని తెలిపారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్ చేసి చికిత్స అందిస్తున్నామన్నారు.
ఏం జరిగింది..?
ఎస్డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SDM College of Medical Sciences)లో చదువుతున్న విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం కళాశాలలోని దాదాపు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 66 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మరో 100 మందికి పైగా విద్యార్థులకు టెస్టు ఫలితాలు శుక్రవారం వచ్చాయి. కాలేజీలో 182 మంది కరోనా బారినపడినట్లు (SDM covid cases) అధికారులు తెలిపారు. నవంబరు 17న కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ (freshers party) జరిగింది. ఈ వేడుకలతోనే వైరస్ వ్యాప్తి జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్..
వైరస్ సోకిన వారిలో చాలా మంది ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ (Already two doses of vaccine) తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరంతా క్యాంపస్ హాస్టళ్లలోనే క్వారంటైన్లో ఉన్నారు. వీరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. వీరి రక్త నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ఈ కాలేజీలో మొత్తం 3000 వరకు విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Corona Vaccine, Karnataka, Medical college