దేశంలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కిట్లు నాసికరంగా ఉండటంతో కచ్చితమైన ఫలితాలు రావడం లేదని అన్నారు. చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ టెస్టు కిట్ల కొరత ఉందని వ్యాఖ్యానించారు. అదే విధంగా లాక్డౌన్ కారణంగా ముఖ్యంగా రైతులు, కార్మికులు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉపాధి లేక, సొంత ప్రాంతాలకు వెళ్లలేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో నడి రోడ్లపై నిలబడి ఉన్నారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఆహార భద్రత, ఆర్ధిక పరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని.. సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా కల్లోలంతో దిక్కుతోచని స్థితిలో పడిన వలస కూలీలకు ఆహార భద్రత కల్పించాలని సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ కుటుంబాలకు 7500 రూపాయలు అందించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే వారు పని దొరకక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ పరిశ్రమలు తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఇక కరోనా కట్టడిలో అతి ముఖ్య అంశమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న కాంగ్రెస్ పార్టీ సూచనను కేంద్రం పట్టించుకోవడం లేదని సోనియా విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Coronavirus, Sonia Gandhi