బెంగళూరు: రాజకీయ నేతల్లో కొందరికి రానురాను ప్రజా సేవ కంటే ఇతర వ్యాపకాల మీద మక్కువ పెరుగుతోంది. ఎక్కడ ఉండి, ఏం చేస్తున్నామనే స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. విషయం బయటకు పొక్కడంతో నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. సరిగ్గా.. ఇలాంటి ఘటనే కర్ణాటక విధాన పరిషత్లో వెలుగుచూసింది. చట్ట సభలను దేవాలయాలుగా భావించాల్సిన పదవిలో ఉండి, ప్రజోపకరమైన పనులు చేయడం మానేసి అశ్లీల దృశ్యాలు వీక్షించిన ఓ అమాత్యుడి లీలలివి. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ శుక్రవారం విధాన పరిషత్కు హాజరయ్యారు. క్వచ్ఛన్ అవర్ సమయంలో ప్రజలకు మేలు చేసే అంశాలపై చర్చించడం మానేసి తన స్మార్ట్ఫోన్లో అశ్లీల దృశ్యాలను వీక్షిస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయారు.
అశ్లీల దృశ్యాలను చూస్తున్న ఎమ్మెల్సీ వీడియో మీడియాలో వైరల్గా మారింది. ‘ఇదేం పని సార్’ అని సదరు ఎమ్మెల్సీని అడగ్గా.. తనకేం తెలియదంటూ బుకాయించారు. మీడియాలో ఏం చూపిస్తున్నారో తెలియదని వ్యాఖ్యనించారు. ‘ఆ సమయంలో మీరు చూసిందేంటో గుర్తుందా’? అని ఎమ్మెల్సీని అడగ్గా.. తాను స్మార్ట్ఫోన్ను సభకు తీసుకెళ్లనని, తన ఫోన్ మెమొరీ ఫుల్ అయిందని, అందువల్ల తన ఫోన్లో ఉన్న కొంత పనికిరాని సమాచారాన్ని తొలగించానని చెప్పారు. క్వచ్ఛన్ అవర్లో చర్చించేందుకు అవసరమైన సమాచారం కోసం ఫోన్ను చూశానని, చాలా సందేశాలు, వీడియోలు ఉండటంతో వాటిని తొలగించానని, మీడియాలో ఏం చూపించారో తనకు తెలియదని ఎమ్మెల్సీ రాథోడ్ సమాధానమిచ్చారు. చట్ట సభల్లో అశ్లీల వీడియోలు చూస్తూ ప్రజా ప్రతినిధులు దొరికిపోవడం ఇది కొత్తేం కాదు.
గతంలో కూడా.. 2012లో కర్ణాటక అసెంబ్లీలో ముగ్గురు మంత్రులు అశ్లీల వీడియోలు వీక్షిస్తూ అడ్డంగా దొరికిపోయారు. స్థానిక మీడియా ఆ వీడియోలను విస్తృతంగా ప్రచారం చేయడంతో సదరు మంత్రులు తమ పదవులకూ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో రాష్ట్ర బీజేపీకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Congress, Karnataka, Karnataka Politics