గ్రామాల్లో మేకలు, ఎద్దులు, ఆవుల దొంగతనాలను చూస్తుంటాం. రాత్రివేళల్లో అందరూ నిద్రపోయిన తర్వాత ఇలాంటి చోరీలు జరుగుతుంటాయి. రాజస్థాన్లో కూడా ఇలాంటి ఓ దొంగతనమే జరిగింది. ఐతే ఈ కేసు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. చోరీ అయిన మేకను దాని యజమానికి ఇవ్వకుండా.. పోలీసులు అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే స్వయంగా ఈ ఆరోపణలు చేశారు. మంత్రి కూడా కలగజేసుకోవడంతో... పోలీసులపై కేసు పెట్టారు. జైపూర్ సమీపంలోని చక్సులో ఈ ఘటన చోటు చేసుకుంది.
రామ్సహాయ్ అనే వ్యక్తి మేకలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆయన మేకల్లో ఒకటి చోరీకి గురయింది. ఎక్కడ వెతికినా దొరకలేదు. సాధారణంగా పంట పొలాల్లో మేపేందుకు వెళ్లినప్పుడు కనిపించకపోతే.. తప్పపోయిందని అనుకోవచ్చు. కానీ ఇంటి ముందే కట్టేసి ఉన్న మేక కనిపించకుండాపోయింది. అంటే రాత్రి సయయంలో దానిని ఎవరో చోరీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మేక చోరీ గురియిందని చెప్పారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత రామ్సహాయ్కి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రెండు మూడు సార్లు ఆయనే పోలీస్ స్టేషన్కి వెళ్లి అడిగితే.. ఇంకా దొరకలేదని సమాధానం చెబుతూ వచ్చారు.
కొన్ని రోజుల తర్వాత ఆ మేక ఓ వ్యక్తి దగ్గర కనిపించింది. దానిని రామ్సహాయ్ గుర్తుపట్టాడు. అది తన మేకే అని నిర్ధారించుకున్నాడు. ఆ మేక నీ వద్దకు ఎలా వచ్చిందని నిలదీశాడు. పోలీసులే మేకను తనకు అమ్మారని చెప్పడంతో.. రామ్సహాయ్ షాక్ తిన్నాడు. దొంగతనానికి గురైన మేకను పోలీసులు రికవరీ చేశారు. కానీ దానిని బాధితుడికి ఇవ్వలేదు. వేరొక వ్యక్తితో అమ్మేశారు. పోలీసులు ఇంత మోసం చేస్తారా? అని రామ్సహాయ్కి కోపం వచ్చింది. అనంతరం పోలీసుల వద్దకు వెళ్లి నిలదీశాడు. నా మేకను వేరొక వ్యక్తికి ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. ఐతే పోలీసులనే ప్రశ్నిస్తావా? అంటూ వారు రామ్సహాయ్ని తిట్టి అక్కడి నుంచి పంపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ సోలంకి దృష్టికి తీసుకెళ్లాడు బాధితుడు. అనంతరం ఆ ఎమ్మెల్యే.. రామ్సహాయ్ని కాంగ్రెస్ ఆఫీసుకు తీసుకెళ్లి.. పోలీసుల తీరుపై మంత్రులకు ఫిర్యాదు చేశారు.
ఆ మేక రామ్సహాయ్దే అని కొన్ని ఆధారాలను కూడా మంత్రుల ముందు ఉంచారు. ఈ కేసు గురించి విన్న తర్వాత.. పోలీసుల తీరుపై రాష్ట్ర యువజన, క్రీడా వ్యవహారాల మంత్రి అశోక్ చందనా మండిపడ్డారు. ఇది చాలా తీవ్రమైన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జైపూర్ పోలీస్ కమిషనర్ని కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు... మరీ ఇంత కక్కుర్తి పడతారా? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారి వల్ల డిపార్ట్మెంట్కు చెడ్డపేరు వస్తుందని.. వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Jaipur, Rajasthan