ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) యొక్క భారత్ జోడో యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్.. అనేక అంశాలపై సమాధానాలు ఇచ్చారు. గత లోక్ సభ ఎన్నికల్లో అమేథీతోపాటు(Amethi) కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్.. అమేథీలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన వాయనాడ్(Wayanad) ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆయన అమేథీ నుంచి మళ్లీ పోటీ చేస్తారా ? అనే అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రశ్నలన్నీ భారత్ జోడో యాత్ర యొక్క ప్రధాన ఆలోచన నుండి దృష్టి మరల్చుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారా లేక రాహుల్ గాంధీ పోటీ చేయరా అని రాయాలని సూచించారు. ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మాత్రమే దీనికి సమాధానం దొరుకుతుందని.. ప్రస్తుతం తన దృష్టి భారత్ జోడో యాత్రపై ఉందని చెప్పుకొచ్చారు.
ఇండోర్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందన్నారు. కానీ అది తనకు ప్రయోజనకరంగా ఉందని చెప్పారు. మెల్లమెల్లగా ఆర్ఎస్ఎస్, బీజేపీల ఆలోచనలను బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టానని రాహుల్ గాంధీ చెప్పారు.
నిరుద్యోగం, రైతుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ దేశానికి పునాది రైతులేనన్నారు. అయితే ప్రస్తుత పాలకులు వాటిని విడిచిపెట్టారని... వారికి ఎవరూ సహాయం చేయడం లేదని అన్నారు. వారికి విత్తనాలు, ఎరువులు, బీమా ఏమీ అందడం లేదని... ప్రైవేటీకరణ గుడ్డిగా జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
కాలేజీలు, యూనివర్శిటీలు, ఆసుపత్రులు అన్నీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. పాఠశాలలు, ఆసుపత్రుల బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్ ఇద్దరు తమ పార్టీకి ఆస్తులు అని రాహుల్ గాంధీ చెప్పారు. ఓ ఆర్ఎస్ఎస్ వ్యక్తి నా వద్దకు వచ్చారని రాహుల్ గాంధీ చెప్పారు. ఆయన కూడా తనకు స్వాగతం పలికారని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Rahul Gandhi