భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సంచలన నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిగా భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని లాంఛనంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అలాగే ప్రతి పార్టీ కార్యాలయంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని పార్టీ సీనియర్ నేత ఒకరు ఆదివారం వెల్లడించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆగస్టు 15ను అధికారికంగా జరుపుకోవాలని సీపీఐ (ఎం) నిర్ణయించుకోవడం విశేషం.
నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు, యువతతో సహా సీపీఐ (ఎం) వివిధ ప్రజా సంస్థలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. సీపీఐ పార్టీ, లెఫ్ట్ ఫ్రంట్ కూడా ఆగస్టు 15 వంటి పలు కార్యక్రమాల ద్వారా రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని సంరక్షించాలనే సందేశాన్ని ఇచ్చాయి. గతంలో 'యే ఆజాది జూతా హై(ఈ స్వతంత్రం అబద్ధం)' అని కమ్యూనిస్ట్ పార్టీ నినాదాలు చేసింది. అయితే ఈ విషయాన్ని బీజేపీ, సంఘ్ పరివార్ లేవనెత్తుతూ వామపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీలో నిర్ణయించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న కమ్యూనిస్టుల ముఖ్యమైన పాత్ర, చరిత్ర గురించి కూడా ప్రచారం చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన జ్యోతిబసు తొలుత స్వాతంత్ర్య దినోత్సవం నాడు తన చేతులతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదు. ఇది అనేక వివాదాలకు, చర్చలకు దారి తీసింది. దీంతో అతను 1989లో రైటర్ బిల్డింగ్ ఎదుట జాతీయ జెండాను ఎగురవేయడం ప్రారంభించారు. చివరికి ఇప్పుడు ఆగష్టు 15ను సెలబ్రేట్ చేయాలనే నిర్ణయం అధికారికంగా బెంగాల్ సీపీఐ ప్రతిపాదన నుంచే రావడం విశేషం.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ లెఫ్ట్ పార్లమెంటరీ నాయకుడు సుజన్ చక్రవర్తి చాలాకాలంగా ఉన్న "అపోహలను" తొలగించాలన్నారు. పార్టీ మొదటిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందనే వాదనను ఆయన తిరస్కరించారు. ఇంతకుముందు కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నామని ఆయన అన్నారు. అతను సెంట్రల్ కమిటీ సమావేశంలో తన ప్రసంగంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే అంశాన్ని లేవనెత్తారు.
అయితే శనివారం రాత్రి పొలిట్ బ్యూరోలో చర్చ జరిగిన అనంతరం, పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్వాతంత్ర్య దినోత్సవ 75వ వార్షికోత్సవాన్ని అన్ని పార్టీ కార్యాలయాల్లో జరుపుకుంటామని ఆదివారం చెప్పారు. 15న స్వాతంత్య్రం వచ్చిన సమయం నుంచి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక వాదాన్ని కాపాడడంలో కమ్యూనిస్టులు పోషించిన పాత్రలను గుర్తు చేయాలని పార్టీ సభ్యులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CPM, Independence Day 2021