కరోనా వైరస్ నివారణకు అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల పంపిణీకి భారత ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చింది. మొదటి దశ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు వ్యాక్సిన్ల భద్రత, వాటి సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో లేనిపోని భయాలు నెలకొన్నాయి. అత్యవసర అనుమతులు ఇవ్వడంవల్ల కొవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వీటి సమర్థతపై అనుమానాలు అవసరం లేదని ప్రభుత్వం ముందు నుంచి చెబుతోంది. వ్యాక్సిన్లపై మన దేశంలో వ్యాపిస్తున్న పుకార్లు, అపోహలను నమ్మవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం చెప్పారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు సమాధానాలు...
ప్రజలందరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలా?
భారత్లో మొదటి దశలో హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ కార్మికులు, 50 ఏళ్లు పైబడినవారు, 50ఏళ్ల లోపు ఉండి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియ స్వచ్ఛందంగా జరుగుతుంది. లబ్ధిదారులు కొవిన్ యాప్లో నమోదు చేయించుకొని వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మొదటి దశలో లబ్ధిదారులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది.
వ్యాక్సిన్ వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందా?
కొవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు తీసుకున్న మహిళలు, మగవాళ్లలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుంతదని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇవన్నీ అపోహలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అలర్జీలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
అలర్జీల సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు అలర్జీలకు సంబంధించిన సలహాలు ఇచ్చాయి. గతంలో ఏదైనా ఆహారం, మెడిసిన్, వ్యాక్సిన్లు తీసుకుంటే అలర్జీలు వచ్చినవారు వ్యాక్సిన్ తీసుకునేముందు వ్యాక్సినేషన్ బృందానికి సమాచారం ఇవ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తమ ఫ్యాక్ట్ షీట్లో పేర్కొంది. అలర్జీల ప్రమాదం ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని భారత్ బయోటెక్ ఫ్యాక్ట్ షీట్లో సూచించింది.
గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
గర్భిణులు, పాలిచ్చే తల్లులపై కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ నిర్వహించలేదు. అందువల్ల మొదటి దశలో వారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిది. తీవ్రమైన అనారోగ్యాల బారిన పడినవారు, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వ్యక్తులు కోలుకున్న 4-8 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇతర సమస్యలకు మందులు వాడేవారు, రక్తస్రావం, జ్వరం వంటి అనారోగ్యాలతో బాధపడేవారు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవద్దని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు ఫ్యాక్ట్ షీట్లో సూచించాయి.
వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తరువాత కూడా మాస్క్ ధరించాలా?
సాధారణంగా కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసుల్లో ఇస్తారు. ఫస్ట్ డోస్ ఇచ్చిన నాలుగు వారాల తరువాత రెండవ డోస్ ఇస్తారు. సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు వారాల తరువాత శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అప్పటి వరకు వైరస్ ప్రమాదం ఉంటుంది. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా సోకినా, వారిపై వైరస్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. అందువల్ల వ్యాక్సినేషన్ పూర్తయిన తరువాత కూడా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
ఇంతకుముందు కరోనావైరస్ సోకినవారు వ్యాక్సిన్ తీసుకోవాలా?
గతంలో వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కానీ కరోనావైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులు పూర్తిగా కోలుకున్న తరువాత, నాలుగు నుంచి ఎనిమిది వారాల అనంతరం వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
వ్యాక్సిన్తో దుష్ర్పభావాలు ఉంటాయా?
సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు చిన్నపాటి దుష్ర్పభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మామూలు నొప్పి, ఇంజెక్షన్ చేసిన దగ్గర వాపు, తేలికపాటి జ్వరం, బాడీ పెయిన్స్, వికారంగా అనిపించడం, దద్దుర్లు వంటి రియాక్షన్స్ కనిపించవచ్చు. కానీ ఇవేవీ ప్రమాదకరంగా మారవని వైద్యులు చెబుతున్నారు.