కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈ వారంలో అతి దారుణ సంఘటనలుగా వేర్వేరు చోట్ల ఓ పోలీస్ అధికారిని, మరో సాధారణ పౌరుణ్ని టెర్రరిస్టులు కాల్చిచంపారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత రూటు మార్చిన టెర్రరిస్టులు భారీ పేలుళ్లు కాకుండా చిన్నచిన్న టార్గెట్లను ఎంచుకుని వారానికి కనీసం ఒకటి రెండు చొప్పున హత్యలకు పాల్పడుతూ వస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో దాడులు జరిపి పరారైపోవడం ముష్కరులకు అలవాటుగా మారింది. తాజా ఘటనపై జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగం చెప్పిన వివరాలివి..
శ్రీనగర్లోని ఈద్గా ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రౌఫ్ అహ్మద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. క్షతగాత్రుడిని ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నవకడల్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కశ్మీర్ జోన్ పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు
అనంతనాగ్ జిల్లా కేంద్రంలోని బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు పాల్పడిన మరో ఘటనలో ఏకంగా ఆస్పత్రిపైనే దాడికి చేశారు. ఒక పని నిమిత్తం అనంత్ నాగ్ జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఏఎస్ఐ మహ్మద్ అష్రఫ్పై ఉగ్రవాదులు తుపాకితో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన రెండు ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
కాగా,నవంబర్ 30న కేంద్రప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపిన వివరాల ప్రకారం..జమ్మూకశ్మీర్ లో ఈ ఏడాది నవంబర్ 15 వరకు ఉగ్రసంబంధిత ఘటనల్లో 40మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా,72మంది పౌరులు గాయపడ్డారు. లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు సమాధానమిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attack, Jammu kashmir, Terrorists