ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 24 మంది జవాన్లు అసువులు బాశారు. మరో 30 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు గాలిస్తున్నారు. అయితే శనివారం బీజాపూర్లో జరిగిన ఎదురు కాల్పుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టులు పక్కా ప్లాన్తోనే భద్రతా సిబ్బందిని ట్రాప్ చేసి చంపేసినట్లు అధికారులు చెబుతున్నారు. మావోయిస్ట్ అగ్రనేత, మోస్ట్ వాటెండ్ మడ్వి హిడ్మా.. తారెమ్ అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు ఓ పుకారు సృష్టించారు మావోయిస్టులు. అది నిజమని నమ్మి అడవుల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. అప్పటికే మాటువేసి ఉన్న మావోయిస్టులు భధ్రతా సిబ్బందిపై మెరుపు దాడి చేశారు.
తారెమ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఇంగ్లీష్ అక్షరం U ఆకారంలో మోహరించారు. మరోవైపు నుంచి భద్రతా సిబ్బంది రాగానే.. మూడు వైపుల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఊహించని ఆ దాడితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఎదురు కాల్పులు జరిపాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా మంది జవాన్లు బుల్లెట్ గాయాలతో నేలకొరిగారు. మరికొందరు భయంతో అడవుల్లోకి పారిపోయారు. ఐతే బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఓ జవాన్ చేతులను కట్ చేసి.. చిత్రహింసలు పెట్టి చంపేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు గాయాల పాలైన జవాన్లలో చాలా మంది బతికేవారు. కానీ ఎక్కువ సేపు ఎదురుకాల్పులు జరగడంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం కష్టమయింది. ఎండలతో డీహైడ్రేషన్కు గురై పలువురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన జవాన్ల నుంచి ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లాక్కొని మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.
ఎన్కౌంటర్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మారణాయుధాలు వాడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. లైట్ మెషీన్ గన్స్ (LMG), అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్ (UBGL)తో పాటు దేశీ రాకెట్స్ ఉపయోగించారని వెల్లడించారు. లైట్ మెషీన్ గన్స్ వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ ఛత్తీస్గఢ్లోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై ఆరాతీశారు. ప్రతీకారం తప్పదని మావోయిస్టులను ఆయన హెచ్చరించారు. భద్రత బలగాలపై మావోయిస్టుల దాడికి తగిన సమయంలో బదులిస్తామని, ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టం చేశారు. భద్రత బలగాల త్యాగాలను వృథా కానిబోవ్వని చెప్పారు. ఇలాంటి దుశ్చర్యను సహించేది లేదని అన్నారు. అక్కడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జవాన్ల మృతిపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక విచారం వ్యక్తం చేశారు. మావోయిస్టులు దుశ్చర్యను పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖండించారు.
మహిళా మావోయిస్టు మృతదేహం లభ్యం..
పోలీసులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగిన చోట ఓ మహిళా మావోయిస్టు మృతదేహం బలగాలకు లభ్యమైంది. ఆమెను పామేడు ఎల్జీఎస్ కమాండర్ మాండవి వనోజాగా గుర్తించారు.
ఎవరీ హిడ్మా..?
మడ్వి హిడ్మా..మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత. అతడి స్వస్థలం ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా పూవర్తి గ్రామం. హిడ్మా వయసు 40 ఏళ్ల వరకు ఉండవచ్చు. 1990ల్లో అతడు మావోయిస్ట్ దళంలో చేరాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ (PLGA) మొదటి బెటాలియన్కు హెడ్గా ఉన్నాడు. 180 నుంచి 250 మంది మావోయిస్టులకు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. అంతేకాదు మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగానూ ఉన్నాడు. హిడ్మా నేతృత్వంలో గతంలో ఎన్నో మావోయిస్టు దాడులు జరిగాయి. ఇతడిపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది. మోస్ట్ వాంటెడ్గా ఉన్న హిడ్మా కోసం భద్రతా దళాలు చాలా ఏళ్లుగా గాలిస్తున్నాయి.
కాగా, ఏప్రిల్ 2న సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని సౌత్ బస్తర్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో కూడిన 2వేల మంది జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో శనివారం తారెమ్ ప్రాంతంలో 400 సభ్యులతో కూడిన జవాన్ల బృందంపై మావోయిస్టులు మెరుపు దాడిచేశారు. మోస్ట్ వాంటెడ్ కమాండర్ మడ్వి హిడ్మా నేతృత్వంలో ఈ దాడి జరిగింది. సుమారు 5 గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. పారిపోయిన మావోయిస్టులతో పాటు గల్లంతైన జవాన్ల కోసం ప్రస్తుతం బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది.
మరణించిన జవాన్లలో ఇద్దరు ఏపీ వాసులు..
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన జవాన్లలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఉన్నారు. ఒకరు విజయనగరం పట్టణంలోని గాజులరేగకు చెందిన రౌతు జగదీష్(27) 2014లో సీఆర్పీఎఫ్-210 కోబ్రా దళంలో చేరారు. మరోకరు.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ(32) ఆరేళ్ల క్రితం సైనిక దళంలో చేరారు. ప్రస్తుతం కోబ్రా-210 విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరు మావోయిస్టుల ఘాతుకానికి బలయ్యారు.
-(జి శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 కరస్పాండెంట్)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chhattisgarh, Encounter, Maoist attack