news18-telugu
Updated: November 19, 2018, 8:58 PM IST
ఎన్నికల విధుల్లో ఉద్యోగులు (File)
ఛత్తీస్గఢ్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది, సామాగ్రి ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల సిబ్బంది, సామాగ్రిని భారీ భద్రత నడుమ హెలికాప్టర్ల ద్వారా పంపారు. 19 జిల్లాల్లో 72 నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
రెండో దశ ఎన్నికల్లో మొత్తం 72 నియోజకర్గాల్లో మొత్తం 1079 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 119 మంది మహిళా అభ్యర్థులున్నారు. మొత్తం 1,53,85,000 పైగా ఓటర్లున్నారు. ఓటింగ్ కోసం 19,296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి దశ ఎన్నికల్లో పలుచోట్ల బాంబు దొరకడంతో..ఈసారి మరింత పకడ్బందీగా బలగాలను రంగంలకి దింపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా దళాలు భారీగా మోహరించారు.
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి (జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్), ప్రతిపక్ష నేత టీఎస్ సింగ్ డియో (కాంగ్రెస్) సహా పలువురు కీలక నేతలు రెండో దశ ఎన్నికల బరిలో ఉన్నారు. సీఎం రమణ్సింగ్ పోటీచేసిన రాజ్నందన్గావ్లో తొలి దశలో పోలింగ్ జరిగింది. ఐతే పోటీ చేసినా..అక్కడ ఆయనకు ఓటు హక్కులేదు. మంగళవారం పోలింగ్ జరగనున్న కవర్దా నియోజకవర్గంలో ఓటు హక్కుంది. రెండో దశ పోలింగ్లో రమణ సింగ్ తన ఓటు వేయనున్నారు.
కాగా, నవంబరు 12న తొలిదశలో 18 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 76.28 శాతం పోలింగ్ నమోదయింది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు హెచ్చరించినప్పటికీ..పోలింగ్ శాతం అధికంగానే నమోదయింది. ఈ నేపథ్యంలో రెండో విడతలోనూ భారీగా ఓటింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబరు 11న ఎన్నికల ఫలితాల వెల్లడవుతాయి
Published by:
Shiva Kumar Addula
First published:
November 19, 2018, 8:50 PM IST