ఆ హోటల్లో కేవలం రూ.10లకే ఏసీ గదిలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. అయితే మనం కూడా ఈ భోజనం తినాలంటే చెన్నై వెళ్లాల్సిందే. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమాని ఒకరు చెన్నైలోని సాలిగ్రామంలో ఈ హోటల్ను నడుపుతున్నాడు. ఈ హోటల్లోని ఏసీ గదిలో కూర్చొని భోజనం చేసినా ప్రత్యేక ఛార్జీలేవీ వసూలు చేయకపోవడం విశేషం. సాధారణ గదిలో కూర్చొని భోజనం చేసినా, ఏసీ గదిలో కూర్చొని చేసినా..ప్లేట్ భోజనంకు రూ.10లు, అన్ లిమిటెడ్ భోజనంకు రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర హోటళ్లకు ధీటుగా అన్నంతో పాటు సాంబార్, రెండు రకాల కర్రీస్, రసం, మజ్జిగ వడ్డిస్తారు. అతి తక్కువ ధరకే కడుపునిండుతున్నందున స్థానిక కార్మికులు, రోజువారీ కూలీలతో ఆ హోటల్ మధ్యాహ్న వేళల్లో కిటకిటలాడుతోంది. ఈ హోటల్ గురించి సోషల్ మీడియాలోనూ ప్రచారం జరగడంతో పరిసర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఇక్కడికొచ్చి భోజనం చేసి వెళ్తున్నారు.
ఏసీ హోటల్స్లో మధ్యాహ్న భోజనం అంటే రూ.100కు పై మాటే. చిన్న హోటల్స్లో కూడా రూ.70-100 వసూలు చేస్తుండగా...ఇక్కడ కేవలం రూ.30లకు అన్ లిమిటెడ్ భోజనంతో కడుపు నింపుకోగలుగుతున్నామని కార్మికులు, రోజువారీ కూలీలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ‘శ్రమజీవి హోటల్’ పేరుతో నడుస్తున్న ఈ హోటల్ బ్రాంచ్లను చెన్నైలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.
చెన్నై మహా నగరంలో ప్లేట్ భోజనంను కేవలం రూ.10లకు వడ్డిస్తున్నారంటే ఊహించికూడా చూడలేము. రజనీకాంత్ అభిమానిగా సేవా దృక్పథంతో లాభాపేక్ష లేకుండా హోటల్ను నడుపుతున్నట్లు వీరబాబు తెలిపారు. ఉదయం, రాత్రి హోటల్ను నడపడం ద్వారా కొంత మేరకు లాభం వస్తుందని, మధ్యాహ్న భోజనం ద్వారా ఏర్పడే నష్టాన్ని దానితో భర్తీ చేసుకుంటున్నట్లు చెప్పారు. కొందరు భోజనం తమకు బాగా నచ్చడంతో రూ.10లు ధర పలికే ప్లేట్ మీల్స్కు కూడా రూ.30లు ఇచ్చి వెళ్తుండగా..వారి సేవా దృక్పథాన్ని మెచ్చుకుంటూ రూ.100 ఇచ్చి వెళ్తుంటారు కొందరు కష్టమర్లు. దాని ద్వారా కూడా కాస్త నష్టాన్ని భర్తీ చేసుకోకుంటున్నారు.
ఇలాంటి రజనీకాంత్ వీరాభిమానులు తమిళనాడులో చాలా మందే ఉన్నారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఆయన అభిమానులు ఇలాంటి హోటల్స్ నడుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajnikanth