న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్తో అతలాకుతలమైన భారత్ ఇప్పుడిప్పుడే ఆ చేదు జ్ఞాపకాల నుంచి కోలుకుంటోంది. ఆక్సిజన్ దొరక్క ఎదుర్కొన్న ఇక్కట్లు, శ్మశానాలకు క్యూ కట్టిన అంబులెన్స్లు, ఆసుపత్రుల నిండా కోవిడ్ రోగులు.. ఇలా కరోనా సెకండ్ వేవ్ భారత్ను బెంబేలెత్తించింది. ఇటీవల రోజువారీ నమోదవుతున్న కేసులు కాస్తంత తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ.. థర్డ్ వేవ్ గుబులు మాత్రం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
అయితే.. తాజాగా భారత్లో థర్డ్ వేవ్ తలెత్తే అవకాశాలపై వైద్య నిపుణులు కీలక ప్రకటన చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారత్లో థర్డ్ వేవ్పై వైద్య నిపుణులు చేసిన తాజా ప్రకటన కాస్త ఊరటనిచ్చింది. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం భారత్పై ఉండకపోవచ్చని వైద్య నిపుణులు ప్రకటించారు. డెల్టా వేరియంట్ ప్రభావం కూడా భారత్లో తగ్గుముఖం పట్టిందని.. వైరస్ వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో థర్డ్ వేవ్ ముప్పు భారత్కు లేనట్టేనని భావించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. థర్డ్ వేవ్ సంకేతాలు లేవని.. మ్యుటెంట్ కూడా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న దాఖలాలు లేవని ఆయన చెప్పారు. ఆయనతో పాటు మరో ఇద్దరు వైద్య నిపుణులు కూడా థర్డ్ వేవ్ అటాక్ చేసే అవకాశాలు భారత్లో క్రమంగా తగ్గుతూ వచ్చాయని.. ప్రస్తుతం ఆ పరిస్థితి భారత్లో లేదని.. రోజురోజుకూ పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపారు. వీరి అభిప్రాయం ఇలా ఉండగా.. ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ మాత్రం థర్డ్ వేవ్ రాదని.. ఎందుకంటే ఇప్పటికే అది మొదలైందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
ముంబైలో థర్డ్ వేవ్ మొదలైందని.. అందుకే నగరంలో కరోనా కేసులు ఉన్నట్టుండి పెరుగుతున్నాయని ఆమె చెప్పారు. నగర ప్రజలంతా వీలైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని.. ఆఫీస్లు కూడా షిఫ్ట్కు కేవలం 10 మంది ఉద్యోగులకు మాత్రమే అనుమతివ్వాలని ఆమె సూచించారు. ముంబై మేయర్ వ్యాఖ్యలు పరిశీలిస్తే మళ్లీ ముంబైలో కరోనా ఉధృతి మొదలైందని స్పష్టమవుతోంది. ముంబై నగరంలో ఆగస్ట్లో నమోదైన 28 శాతం కరోనా కేసులు.. సెప్టెంబర్లో ఆరు రోజుల వ్యవధిలోనే నమోదు కావడం గమనార్హం. సోమవారం ముంబై నగరంలో కొత్తగా 379 పాజిటివ్ కేసులు, ఐదు కరోనా మరణాలు నమోదయ్యాయి.
వినాయక చవితితో పాటు పండుగల సీజన్ ప్రారంభమైన ఈ తరుణంలో కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్-19 ఫస్ట్ వేవ్ కూడా పండుగల సీజన్లోనే మొదలైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కూడా ఇప్పటికే కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పొలిటికల్ ర్యాలీలను, మతపరమైన కార్యక్రమాలను వీలైనంత వరకూ రద్దు చేసుకోవాలని ఆయన సూచించారు. పండుగలపై కూడా ఆయన కుండబద్ధలు కొట్టారు. ప్రజారోగ్యం అన్నింటి కంటే ముఖ్యమని, పండుగలు భవిష్యత్లో కూడా చేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
కోవిడ్ కేసులు మళ్లీ పెరిగితే పరిస్థితి అధ్వానంగా తయారవుతుందని.. థర్డ్ వేవ్ దరి చేరకుండా ప్రజారోగ్యాన్ని కాపాడటమే తమ తొలి ప్రాధాన్యమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చెప్పారు. లాక్డౌన్పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే కఠిన ఆంక్షలు విధించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కరోనా థర్డ్ వేవ్ ఎలా మొదలైందో తమకు బాగా గుర్తుందని మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.