కర్ణాటకలో తప్పకుండా మరోసారి బీజేపీ (BJP) ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ కర్ణాటక ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra pradhan) న్యూస్ 18 నెట్వర్క్ నిర్వహిస్తున్న ‘రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023’లో పాల్గొని కర్ణాటక ఎన్నికలపై మాట్లాడారు.
అభివృద్ధి ప్రాతిపదకన రిజర్వేషన్లు..
కర్ణాటకలో (Karnataka) సీఎం బసవరాజ బొమ్మై తీసుకొచ్చిన రిజర్వేషన్ పాలసీని ప్రజలు స్వాగతించారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే కాంగ్రెస్ ఆందోళన చేస్తోందని విమర్శించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సౌత్ ఇండియాలో రిజర్వేషన్లు కాస్త భిన్నంగా ఉంటాయని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి ప్రాతిపదకనే ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ పాలసీపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆయన దుమ్మెత్తి పోశారు.
ప్రధాని మేనియా..
రైజింగ్ ఇండియా సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ మేనియా ప్రతి రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఈ ఏడాది మేలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల విషయంపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని చెప్పేశారు. బీజేపీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మోదీ ప్రభావం ఎలాంటిదో రుజువైందని తెలిపారు. ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
మే 10న ఎన్నికలు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. మే 10న ఒకే విడతలో 224 స్థానాలకు పోలింగ్ని నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. మే 13న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, ఈ ఎన్నికలను అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా కర్ణాటకలో వరుసగా రెండో సారి అధికారం చేపట్టలేదు. దీంతో ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్రను తిరగరాయాలని బీజేపీ పట్టుదలతో ఉంది.
Rising India Summit: చట్టం అందరికీ సమానమే.. ఓబీసీలకు ఇంకా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పలేదు: జైశంకర్
‘శివసేన మాతోనే ఉంది..ఉద్దవ్ సొంత పార్టీని విడిచిపెట్టాడు..’ రైజింగ్ ఇండియా సమ్మిట్లో పీయూష్ గోయల్
రాహుల్ గాంధీ వివాదంపై..
రాహుల్ గాంధీపై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు గుప్పించారు. ఓబీసీలపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇలా ఓబీసీ వర్గాన్ని కించపరచడం రాహుల్కి ఇదేమీ తొలిసారి కాదని ఆయన చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర సఫలం కాలేదని తెలిపారు. అందుకే కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలు చేస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు.
న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో ‘రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023’ అట్టహాసంగా జరుగుతోంది. నేడు ప్రారంభమైన ఈ సదస్సుకు కేంద్రమంత్రులు, ప్రముఖులు తరలివస్తున్నారు. రేపు కూడా సదస్సు జరగనుంది. భారత అభివృద్ధికి తోడ్పడుతున్న వీరులను సత్కరించే ఉద్దేశంతో ఈ సదస్సును పూనావాలా ఫిన్కార్ప్తో కలిసి న్యూస్ 18 నెట్వర్క్ నిర్వహిస్తోంది. ఇది మూడో ఎడిషన్ కావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.