దేశంలోని 24 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తించినట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరో రెండు యూనివర్సిటీలు నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపింది. ఈ వివరాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్సభకు తెలిపారు. సభ్యులు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు సమాధానంగా ప్రధాన్ ఈ ప్రకటన చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వీటిని నకిలీ విశ్వవిద్యాలయాలుగా గుర్తించిందని తెలిపారు. లక్నోలోని భారతీయ శిక్షా పరిషత్, ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ (ఐఐపిఎం) విద్యాసంస్థలు యూజీసీ చట్టం-1956ని ఉల్లంఘిస్తూ పనిచేస్తున్నాయని మంత్రి చెప్పారు. ఈ రెండు విద్యాసంస్థలపై న్యాయ విచారణ జరుగుతోందన్నారు.
ఉత్తర ప్రదేశ్లో అత్యధికంగా ఎనిమిది నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వారణాసి సంస్కృత విశ్వవిద్యాలయం, అలహాబాద్లోని మహిళా గ్రామ విద్యాపీఠం, అలహాబాద్లోని గాంధీ హిందీ విద్యాపీఠం, కాన్పూర్లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, అలీఘర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ, మధురలోని ఉత్తర ప్రదేశ్ విశ్వవిద్యాలయం, ప్రతాప్గఢ్లోని మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవిద్యాలయం, నొయిడాలోని ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్.. ఈ జాబితాలో ఉన్నాయి.
ఢిల్లీలో మొత్తం ఏడు నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఒకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జుడిషియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, స్పిరిచ్యువల్ యూనివర్సిటీ... ఇవన్నీ నకిలీ విద్యాసంస్థలేనని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కోల్కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ వర్సిటీలు పశ్చిమ్ బెంగాల్ జాబితాలో ఉన్నాయి. రూర్కెరాలోని నభారత్ శిక్షా పరిషత్, నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థలు ఒడిశాలోని నకిలీ యూనివర్సిటీల జాబితాలో ఉన్నాయి.
కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, మహారాష్ట్రలలో ఒక్కొక్క నకిలీ యూనివర్సిటీ ఉంది. పుదుచ్చేరిలోని శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్లోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, నాగపూర్లోని రాజా అరబిక్ యూనివర్సిటీ, కేరళలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కర్ణాటకలోని బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ.. వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
నకిలీ లేదా గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలపై యుజీసీ తీసుకుంటున్న చర్యల గురించి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. జాతీయ హిందీ, ఇంగ్లీష్ వార్తాపత్రికల్లో నకిలీ విశ్వవిద్యాలయాలు, సంస్థల జాబితా గురించి యూజీసీ పబ్లిక్ నోటీసులు జారీ చేస్తుందని తెలిపారు. ఇలాంటి యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు యూజీసీ లేఖలు రాస్తుందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.