దేశంలోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీలైన సీరం, భారత్ బయోటెక్లు.. టీకాకు నిర్ధారించిన ధరలపై అనేక రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రానికి తక్కువ ధర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ధరకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ రెండు కంపెనీలు నిర్ణయించడంపై అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పించాయి. ఒకే దేశం ఒకే టాక్స్ అని చెప్పిన కేంద్రం.. వ్యాక్సిన్ విషయంలో మాత్రం ఇందుకు పూర్తిగా వ్యవహరిస్తోందని పలు రాష్ట్రాలు ఆరోపించాయి. ఈ విషయంలో కేంద్రంపై పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. రాష్ట్రాలకు అందించే టీకా ధరను తగ్గించాలని కేంద్రం వ్యాక్సిన్ తయారీ కంపెనీలైన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్లను కోరింది.
కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. అనంతరం వ్యాక్సిన్ కంపెనీలకు కేంద్రం ఈ మేరకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ రెండు కంపెనీలు ఇంతకుముందు నిర్ధారించిన ధరలను సవరించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాము ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ డోసులను రాష్ట్రాలకు రూ. 600, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 1200 ఇవ్వాలని భారత్ బయోటెక్ నిర్ణయించింది. ఇక సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ను రాష్ట్రాలకు రూ. 400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 600కు ఇవ్వాలని ఆ సంస్థ నిర్ణయించింది.
ఈ రెండు కంపెనీలు తాము ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లలో 50 శాతాన్ని కేంద్రానికి రూ. 150కే ఇవ్వాలని నిర్ణయించాయి. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వాళ్లందరికీ కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో.. ఇది తమకు అదనపు ఆర్థిక భారంగా మారుతుందని రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయినా ఈ భారాన్ని భరించి ప్రజలకు టీకా అందిస్తామని పేర్కొన్నాయి. అయితే రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. వ్యాక్సిన్ తయారీ కంపెనీలను ధరలను సవరించాలని కోరినట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covaxin, Covishield