CENTRAL GOVERNMENT TO ALLOW WOMEN IN NATIONAL DEFENSE ACADEMY TELLS TO SUPREME COURT BA
కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం.. మహిళలకు వరం.. ముఖ్యంగా యువతులకు జోష్..
ప్రతీకాత్మక చిత్రం
NDA Eligibility Test for Women | త్రివిధ దళాల్లో మహిళలు కూడా సేవలు అందిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇంజినీర్లు, సిగ్నలర్స్, న్యాయవాదులు, ఇలా పలు విభాగాల్లో మహిళలు ఉన్నారు. అయితే, పోరాట విధుల్లో కూడా వారిని తీసుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం (Central Government) చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (National Defense Academy) ద్వారా సైనిక దళాల్లో మహిళలకు కూడా స్థానం కల్పించనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలు (NDA Exams) రాసేందుకు మహిళలకు కూడా అవకాశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ బెంచ్ ఎదుట అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తెలియజేశారు. ‘ఓ గుడ్ న్యూస్. ప్రభుత్వం, సైనిక దళాల అత్యున్నత అధికారులు ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా యువతులకు పర్మినెంట్ కమిషన్లో స్థానం కల్పించాలని నిర్ణయించారు. నిన్న రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.’ అని ఏఎస్జీ కోర్టుకు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఫిడవిట్ ద్వారా కోర్టు ముందు ఉంచాలని జస్టిస్ సంజయ్ కిషన్ సారధ్యంలోని బెంచ్ ఐశ్వర్య భాటీకి సూచించింది. ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవి దేశంలో అత్యంత గౌరవం ఉన్న ఫోర్సెస్లో ఒకటి. అయితే, లింగ సమానత్వం విషయంలో మాత్రం అవి చేయాల్సింది ఇంకా ఉంది.’ అని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు.
మహిళలను ఎన్డీయేలో చేరనివ్వకపోవడం వారి రాజ్యంగపరమైన హక్కులకు విరుద్ధమని, వివక్షచూపడం సరికాదంటూ కుష్ కల్రా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆగస్టు 18న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలకు ఎన్డీయే పరీక్షలకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్పుడే తీసుకుని ఉంటే తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదని జస్టిస్ కౌల్ అన్నారు.
‘ఎన్డీయే ద్వారా మహిళలకు సైనిక దళాల్లో అవకాశం కల్పించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుందని ఏఎస్జీ చెప్పడం ఆనందదాయకం. అయితే, అది అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుకు రావాలి. అందుకు సమయం పడుతుంది. దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ప్లాన్లు ఏంటి? ఎలా అమలుచేయబోతున్నారో అప్పుడు తెలుస్తుంది. లింగసమానత్వం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.’ అని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుదర్శ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.
త్రివిధ దళాల్లో మహిళలు కూడా సేవలు అందిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇంజినీర్లు, సిగ్నలర్స్, న్యాయవాదులు, ఇలా పలు విభాగాల్లో మహిళలు ఉన్నారు. అయితే, పోరాట విధుల్లో కూడా వారిని తీసుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. 2020 సంవత్సరం మొదట్లో దీనికి సంబంధించి కీలక ముందడుగు పడింది. మహిళలపై ‘మిలటరీ బ్యాన్’ను తీసేసి వారినికూడా పోరాట విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.