నోటుకు ట్వీటు. ఔను మీరు చదివింది కరెక్టే. ఇది ఓటుకు నోటు కాదు. నోటుకు ట్వీటు. అంటే డబ్బులిస్తే ట్వీట్ చేస్తారన్నమాట. ‘ఆపరేషన్ కోరకే’ పేరుతో కోబ్రాపోస్ట్ వెబ్ సైట్ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్లో 30 మందికి పైగా సినీ సెలబ్రిటీలు.. ఇలా డబ్బులిస్తే ట్వీట్ చేసేందుకు సిద్ధమని అంగీకరించారు. కోబ్రాపోస్ట్ కథనం ప్రకారం.. ఆ సంస్థ ప్రతినిధులు తమను తాము ఓ ప్రజాసంబంధాల సంస్థ నుంచి వస్తున్నామంటూ ఆ సినీ సెలబ్రిటీలను పరిచయం చేసుకున్నారు. తాము వివిధ పార్టీలకు పనిచేస్తామని తెలిపారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలకు పీఆర్ సేవలు అందిస్తామని చెప్పారు. ఈ క్రమంలో భాగంగా తాము చెప్పిన పార్టీకి అనుకూలంగా ట్వీట్ చేస్తే.. అందుకు తగిన పారితోషికం అందిస్తామని ఆఫర్ చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
మొత్తం 36 మంది సినీ, టీవీ సెలబ్రిటీలు తాము ఇచ్చిన ఆఫర్కు ఓకే చెప్పారని కోబ్రాపోస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ అనిరుద్ధ్ భల్ తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఆయా పోస్టులు పెట్టేందుకు అంగీకరించారని వివరించారు. అందుకోసం ఒక్కో పోస్ట్కు రూ.2లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఫీజు అడిగినట్టు తమ స్టింగ్ ఆపరేషన్లో వెల్లడైందని చెప్పారు. సుమారు ఎనిమిది నెలల కాంట్రాక్ట్ కోసం కొందరు ఏకంగా రూ.20కోట్లు కూడా అడిగినట్టు ఆయన వివరించారు.

సన్నీలియోని
ఫీజు మొత్తం బ్లాక్ మనీలో కావాలా? వైట్లో కావాలా అని అడిగితే, కొందరు మాత్రం మొత్తం చెక్ రూపంలో ఇవ్వాలని కోరారు. మరికొందరు మాత్రం క్యాష్ రూపంలో అడిగారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత తమ పాన్ కార్డు డిటెయిల్స్ ఇచ్చేందుకు కొందరు అంగీకరించినట్టు కోబ్రాపోస్ట్ తెలిపింది. డీల్ కుదరకముందే కొందరు అత్యుత్సాహంతో కొన్ని ట్వీట్లు కూడా చేసినట్టు కోబ్రాపోస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ తెలిపారు.

ప్రధాని మోడీ బయోపిక్లో వివేక్ ఒబెరాయ్
కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ప్రకారం వీళ్లంతా నోటుకు ట్వీట్ చేయడానికి అంగీకరించారు. జాకీ ష్రాఫ్, కైలాష్ ఖేర్, వివేక్ ఒబెరాయ్, సోను సూద్, శ్రేయాస్ తల్పాడే, సన్నీలియోనీ, శక్తి కపూర్, అమీషా పటేల్, టిస్కా చోప్రా, రాఖీసావంత్, టీవీ నటులు పంకజ్ ధీర్, నికితిన్ ధీర్, పునీత్ ఇసార్, రాజ్పాల్ యాదవ్, మినిషా లాంబా, హితేన్ తేజ్వానీ ఆయన భార్య గౌరీ ప్రధాన్, మహిమా చౌదరి, రోహిత్ రాయ్, అమన్ వర్మ, కోనా మిత్రా, రాహుల్ భట్ వంటి వారు ఉన్నారు.

విద్యాబాలన్ ఫైల్ ఫోటో
కొందరు నోటుకు ట్వీట్ చేయడానికి అంగీకరిస్తే.. మరికొందరు నటులు అలా చేయడానికి నిరాకరించారు. విద్యాబాలన్, అర్షద్ వార్సి, రజా మురద్, సౌమ్య టాండన్ లాంటి వారు డబ్బులు తీసుకుని ఒకరికి అనుకూలంగా ట్వీట్ చేయడానికి నో చెప్పారు.