నివర్ తుఫాన్ బీభత్సాన్ని మరవకముందే మరో తుఫాన్ ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో బురేవి తుఫాన్ (Burevi Cyclone) అలజడి సృష్టిస్తోంది. దక్షిణ తీరంలో బీభత్సం సృష్టించేందుకు దూసుకొస్తోంది. బురేవి భయంతో తమిళనాడు, కేరళలోని తీర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ ప్రాంతాలకు వాతావరణశాఖ యెల్లె మెసేజ్ అలర్ట్ జారీచేసింది. ఇవాళ ఉదయం 05.30కి ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. బురేవి తుఫాన్ శ్రీలంకలోని త్రీణకోమలికి తూర్పు ఆగ్నేయ దిశగా 300 కి.మీ దూరంలో.. పంబన్కు 530 కి.మీ. దూరంలో ఉంది. ఇక కన్యాకుమారికి తూర్పు దిశగా 700 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం బురేవి తుఫాన్ గంటకు 12 కి.మీ. వేగంతో ముందుకు కదులుతోంది.
రాబోయే ఆరుగంటల్లో మరింతగా బలపడి తీవ్ర తుఫాన్గా మారనుంది బురేవి. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి తృణకోమలి (శ్రీలంక)కి సమీపంలో తీరం దాటనుంది. అనంతరం అలాగే వాయువ్య దిశగా కదలి.. డిసెంబరు 3న గల్ఫ్ ఆఫ్ మన్నార్, కోమోరిన్ ప్రాంతాల వైపు వెళ్తుంది. ఇక మన దేశంలో డిసెంబరు 4న తీరం దాటనుంది బురేవి. శుక్రవారం కన్యాకుమారి, పంబన్ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఆ సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 85 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
బురేవి తుఫాన్ ప్రభావంతో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకూడి, తెన్కాశి, రామనాథపురం, శివగంగై జిల్లాలు, కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పతానంతిట్ట, అలప్పుళ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అంతేకాదు ఇవాళ, రేపు ఏపీలోని దక్షిణ కోస్తాతో పాటు పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.