భారత సరిహద్దు రక్షణదళం (BSF) పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లింది. బీఎస్ఎఫ్ టీమ్ 200 మీటర్ల పాక్ భూభాగంలోకి వెళ్లి.. దాయాది కుట్రలను బహిర్గతం చేసింది. భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ఏర్పాటు చేసిన రహస్య సొరంగ మార్గాని గుర్తించారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ఎన్కౌంటర్లో హతమైన పాకిస్తాన్ టెర్రరిస్టులు.. ఓ సొరంగ మార్గం ద్వారానే భారత్లో చొరబడినట్లు బీఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్, కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆ చొరబాటు మార్గం గుండా వెళ్లి పరిశీలించారు. ఈ వివరాలను బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా మీడియాకు వెల్లడించారు.
''పాకిస్తాన్ భూభాగం నుంచి ప్రారంభమయ్యే ఓ సొరంగమార్గాన్ని మేం గుర్తించాం. అది సాంబా జిల్లా బోర్డర్ పోస్ట్ సమీపంలో భారత్లో నిష్క్రమిస్తుంది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 160 మీటర్లు, సరిహద్దు కంచె నుంచి 70 మీటర్ల పొడవు, 25 మీటర్ల లోతు ఉంది. భారత వైపు దట్టమైన పొదల మధ్య నిష్క్రమణ ద్వారం ఉంది. ఉగ్రవాదులు సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత.. సాంబా జిల్లాలోని జత్వాల్ గ్రామంలో హైవేపై ఓ ట్రక్ ఎక్కి జమ్మూ వరకు వచ్చారు. నవంబరు 22న ఈ సొరంగమార్గాన్ని గుర్తించాం. బీఎస్ఎఫ్ సిబ్బంది అందులో 200 మీటర్ల మేర పాక్ భూభాగంలో ప్రయాణించారు. తిరిగి వచ్చేటప్పుడు సాక్షాధారాల కోసం సొరంగంలోని దృశ్యాలను రికార్డు చేసి తీసుకువచ్చాం.'' అని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, జమ్మూకశ్మీర్లోని నగ్రోటాలో నవంబర్ 19న భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. నగ్రోటాలోని టోల్ ప్లాజా వద్ద పాకిస్తాన్కు చెందిన నలుగురు జైషే ఉగ్రవాదులను భారత భద్రతాదళాలు మట్టుబెట్టారు. కాల్పుల అనంతరం వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు భారత్లోకి ఎలా చొరబడ్డారన్న దానిపై అధికారులు సీరియస్గా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 22న సొరంగమార్గం ద్వారా భారత్లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు నిర్ధారించారు. ఇటీవలే ఆ సొరంగ మార్గంలో ప్రయాణించి ఆధారాలు సేకరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BSF, India pakistan, Jammu and Kashmir, Pakistan army