BRIDE MARRIES SISTERS GROOM AFTER MIX UP DUE TO POWER FAILURE IN MADHYA PRADESH UJJAIN MKS
Wedding mix-up: ఏం జాతిరత్నాలురా మీరు! -ది గ్రేట్ ఇండియన్ గందరగోళం పెళ్లి -ట్విస్టులు భరించలేం..
గందరగోళం పెళ్లిలో చివరి దృశ్యం
తాళికట్టు శుభవేళ కరెంటు పోయిన కారణంగా ఓ వివాహ తంతు గ్రేట్ ఇండియన్ గందరగోళం పెళ్లిలా మారిపోయింది. వేదికపై షాకింగ్ ఛండాలం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని మన జాతిరత్నాలు తెల్లారాక గానీ గుర్తించలేదు!
పెళ్లంటే? పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. మూడు ముళ్లు, ఏడు అడుగులతోపాటు డీజే సౌండ్లు మాత్రమే కాదు.. రాత్రి పూట ముహుర్తమైతే నిరంతరాయ కరెంటు కూడా. తాళికట్టు శుభవేళ కరెంటు పోయిన కారణంగా ఓ వివాహ తంతు గ్రేట్ ఇండియన్ గందరగోళం పెళ్లిలా మారిపోయింది. చెల్లెలు బావను.. మరిదిగారు వదినను మనువాడి మొత్తంగా ఛండాలం చోటుచేసుకుంది. జంటలు మారిపోయిన విషయాన్ని మన జాతిరత్నాలు తెల్లారాక గానీ గుర్తించలేదు! కరెంటు కోత వల్ల ఏర్పడిన కన్ఫ్యూజన్ పెద్ద పంచాయితీకి దారితీసింది. చివరికి పెద్దమనుషుల తీర్మానంతోగానీ సమస్య పరిష్కారం కాలేదు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలో ఆదివారం చోటుచేసుకుందీ సినిమాటిక్ ఘటనట. వివరాలివే..
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాకు చెందిన రమేశ్ లాల్ కు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి నిఖిత, చిన్నమ్మాయి కరిష్మా. ఇద్దరికీ 21 ఏళ్లు దాటకున్నా మంచి సంబంధాలు అనే భావనలో ఇద్దరు కూతుళ్లకూ ఒకేసారి పెళ్లిళ్లు ఫిక్స్ చేశాడు రమేశ్ లాల్. పెళ్లి కొడుకులు భోలా, గణేశ్లవి వేర్వేరు ఊర్లు. వాళ్లయినా మూతిమీద సరిగా మీసం మొలిచిన బాపతు కూడా కాదు. అంటే చూడ్డానికి రెండు జంటలవీ బాల్యవివాహాలా? అనే అనుమానం రాకపోదు. పెళ్లి ముహుర్తాన ఏం జరిగిందంటే..
పెద్దలు నిశ్చియించిన పెళ్లి కావడం, హడావుడిగా ముహుర్తం నిర్ణయించడంతో జంటలిద్దరూ తమ జోడీలను పరిశీలనగా చూసుకునే అవకాశం రాలేదు. మొన్న శనివారం రాత్రి ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు జరిగాయి. అయితే, సరిగ్గా తాళికట్టే సమయంలో కరెంట్ పోవడంతో పెండ్లి మంటపంలో చీకట్లు కమ్ముకున్నాయి. అక్కాచెల్లెళ్లు ఒకే రకమైన పెండ్లి దుస్తుల్లో ఉండటంతో పొరబడిన చెల్లెలి కాబోయే భర్త ఆమె అక్కను మనువాడాడు. అక్కను పెండ్లి చేసుకోవాల్సిన వరుడు ఆమె చెల్లెలి మెడలో వరమాల వేశాడు.
జంటలు తారుమారైన సంగతి ఎవరూ గుర్తించలేదు. గుడ్డి దీపాల వెలుగులో పురోహితుడు సైతంపెండ్లి కుమార్తెలు అటుఇటు అయిన సంగతి చూసుకోకుండా వివాహ తంతు జరిపించాడు. ఆ కరెంటు కోత చీకటిలోనే అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయింది. తీరా పెండ్లి కుమారులు తమ ఇళ్లకు వధువులను తీసుకువెళ్లే సరికి తెల్లారింది. అప్పుడుగానీ జరిగిన భారీ తప్పిదాన్ని అందరూ గుర్తించలేకపోయారు.
హుటాహుటిన ఫోన్లు చేసుకొని మళ్లీ అందరూ ఒక ఊరిలో పోగయ్యాక పెద్ద గొడవ జరిగింది. ఊరి పెద్దలు శాంతింపజేయడంతో వ్యవహారం సర్దుకుంది. చివరికి మరుసటిరోజైన ఆదివారం మళ్లీ పెళ్లి తంతును నిర్వహించారు. ఈసారి పట్టపగలు కావడంతో కరెంటు లేకున్నా కన్ఫ్యూజన్ కు మాత్రం అవకాశంలేకుండా పోయింది. ఇంకా నయం, రాత్రికి రాత్రే కార్యం కూడా జరిపించి ఉంటే వ్యవహారం మరింత జఠిలంగా అయ్యేదంటూ గుసగుసలాడారు ఊళ్లోని కొంటె పిల్లలు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.