ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) రెండు డోసులు వేస్తున్నారు. ఒమిక్రాన్ (Omicron) విజృంభణ నేపథ్యంలో.. ఈ మధ్యే బూస్టర్ డోస్ను కూడా ప్రకటించారు. ఐతే ముందుగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, 60 ఏళ్లు పైడిన వారికి మాత్రమే మూడో టీకా వేస్తారు. మరోవైపు మనలో చాలా మంది ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకోలేదు. కొందరు అసలే తీసుకోకుంటే..మరికొందరు ఒక్క డోస్తో సరిపెట్టుకున్నారు. కానీ బీహార్ (Bihar)లోని ఓవ్యక్తి మాత్రం ఏకంగా 11 డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. మాధేపురా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
మాధేపురా జిల్లా ఉదాకిశున్గంజ్ సబ్ డివిజిన్ పరిధిలోని ఒరై గ్రామానికి చెందిన బ్రహ్మదేవ్ మండల్ (84) ఇప్పటి వరకు 11 డోసుల కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. కరోనా టీకా తీసుకున్నప్పటి నుంచి తన ఆరోగ్యం ఎంతో బాగుందని.. అందుకనే అప్పటి నుంచి వరుసగా టీకాలు వేసుకుంటున్నానని చెప్పాడు. రెండురోజుల క్రితం 12వ డోస్ వేసుకునేందుకు చౌసా పీహెచ్సీకి వెళ్లాడు. కానీ అక్కడి టీకా కేంద్రం మూతపడడంతో బ్రహ్మదేవ్ మండల్ వెనుదిరిగాడు. లేదంటే 12వ డోస్ కూడా వేసుకొని ఉండేవాడు.
Wife And Husband: ముహూర్తం సరిగా లేదని.. 11 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉన్న భార్య.. ఆమె తల్లి..
ఆధార్ కార్డులో ఉన్న వివరాల ప్రకారం.. బ్రహ్మదేవ్ మండల్ వయసు 84 ఏళ్లు. గతంలో ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. పదవీ విరమణ తర్వాత సొంత గ్రామంలోనే నివసిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 13న బ్రహ్మదేవ్ తన మొదటి కరోనా డోస్ తీసుకున్నారు. ఆ తర్వాత చాలా సార్లు వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఫిబ్రవరి 13 మరియు డిసెంబర్ 30, 2021 మధ్య ఆయన ఏకంగా 11 డోసులు తీసుకున్నారు. తాను ఏ రోజున ఏ సమయానికి వ్యాక్సిన్ తీసుకున్నాడో.. ఆ వివరాలన్నింటినీ పేపర్పై రాసి పెట్టుకున్నారు. కేవలం ఆయన రాసి పెట్టుకున్న పేపర్ మాత్రమే కాదు.. వైద్యఆరోగ్యశాఖ రికార్డులు కూడా 11 డోస్ల వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెబుతున్నాయి.
Gas Leak: ఘోర ప్రమాదం.. ట్యాంకర్ నుంచి విష వాయువులు లీక్.. ఆరుగురు మృతి
ఆ రికార్డుల ప్రకారం.. గత ఏడాది ఫిబ్రవరి 13న స్థానిక పీహెచ్సీలో మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు బ్రహ్మదేవ్. ఆ తర్వాత మార్చి 13న రెండో డోస్ కూడా అదే పీహెచ్సీలో తీసుకున్నారు. ఆ తర్వాత మూడో డోస్ను మే 19న ఓరై సబ్ హెల్త్ సెంటర్లో వేసుకున్నారు. జూన్ 16న భూపేంద్ర భగత్ కోటాలో జరిగిన శిబిరంలో నాలుగో డోస్, జూలై 24న ఓ స్కూల్లో ఐదో డోస్, ఆగస్ట్ 31న నాథ్బాబా స్థాన్ క్యాంపులో ఆరో డోస్, సెప్టెంబరు 11న బడి హాత్ స్కూల్లో ఏడో డోస్ తీసుకున్నారు. ఎనిమిదవది సెప్టెంబర్ 22న బాడీ హాత్ స్కూల్లో, తొమ్మిదవది సెప్టెంబరు 24న హెల్త్ సబ్ సెంటర్లో, 10వ డోస్ ఖగారియా జిల్లాలోని పర్వతా వద్ద వేసుకున్నారు. ఇక 11న డోస్ వ్యాక్సిన్ భాగల్పూర్లోని కహల్గావ్లో తీసుకున్నారు బ్రహ్మదేవ్.
India Corona Bulletin: లాక్డౌన్స్ తప్పవా..? లక్షకు చేరువలో రోజువారీ కరోనా కేసులు
బ్రహ్మదేవ్ మండల్ తన ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్పై 8 సార్లు, ఓటర్ ఐడీ కార్డు, భార్య మొబైల్ నెంబర్పై మరో 3 సార్లు టీకా వేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఐతే వ్యాక్సిన్ అమృతం లాంటిది.. తన ఆరోగ్యానికి ఎంతో మేలుచేసిందని బ్రహ్మదేవ్ తెలిపారు. ఎన్నో అద్భుతాలు చేసిందని సంబరపడుతున్నారు. అందుకే ఇన్నిసార్లు టీకాలు వేసుకున్నన్నట్లు వెల్లడించారు. టీకాలపై ఎలాంట అపోహలు పెట్టుకోకుండా... ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మన దేశంలో రెండు డోసుల టీకాలు మాత్రమే వేస్తున్నారు. కానీ ఈయన ఏకంగా 11 డోసుల వ్యాక్సిన్లను తీసుకున్నారంటే.. అక్కడి వైద్యఆరోగ్యశాఖలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయపోవడం వల్లే ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. మరి ఇన్ని టీకాలు తీసుకున్న ఆయనతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోగ్య సిబ్బందిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఆసక్తిగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Bihar News, Corona Vaccine, Covid-19