జనాభా పరంగా దేశంలో మూడో అతిపెద్ద రాష్ట్రం బీహార్ లో ఇంటర్(12వ తరగతి బోర్డు) పరీక్షా ఫలితాలు (Bihar Board 12th Result 2022) వెలువడ్డాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి బుధవారం ఫలితాలను విడుదల చేశారు. బీహార్ 12వ తరగతి బోర్డు పరీక్షలకు ఈసారి అన్ని విభాగాలు కలిపి మొత్తం 13.45 లక్షల మంది హాజరుకాగా 80.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఓ పేదింటికి చెందిన ఆటో డ్రైవర్ కొడుకు సంగ్రామ్ రాజ్(Sangam Raj) టాపర్ గా నిలిచాడు.
బీహార్ 12వ తరగతి బోర్డు అధికారిక వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. కామర్స్లో 90.38 శాతం, సైన్స్లో 79. 85 శాతం, ఆర్ట్స్లో 79.53 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రచారం చేసుకునే ‘ఉనన్ సిములతాలా ఆవాసీ విద్యాలయం’ నుంచి ఈసారి ఒక్కరు కూడా టాపర్గా రాలేదు. ప్రతిసారీ ఈ ఆవాస విద్యాలయం నుంచే టాపర్లు వస్తుంటారు.
ఆర్ట్స్ విభాగం విద్యార్థి అయిన సంగ్రామ్ రాజ్ ఏకంగా 96.4 శాతం మార్కులు సాధించాడు. గోపాల్ గంజ్కు చెందిన సంగ్రామ్ రాజ్ ఓ సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు కావడం విశేషం. గోపాల్ గంజ్ లో ఈ-ఆటో రిక్షా నడుపుతాడు అతని తండ్రి. ‘నా వల్ల మా కుటుంబమంతా సంతోషంగా ఉందన్న ఫీలింగ్ వెల కట్టలేనిది. నా మార్కుల సంగతి తర్వాత’అని నవ్వుతూ అంటాడు సంగ్రామ్.
ఐఏఎస్ అధికారి కావడం తన కల అని, అందుకోసం స్కూల్ వయసు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టానని సంగ్రామ్ ‘న్యూస్ 18’కు చెప్పాడు. ఆటో డ్రైవర్ ముగ్గురు కొడుకుల్లో రెండోవాడు సంగ్రామ్. కాగా, బీహార్ ఇంటర్ ఫలితాల్లో కామర్స్ విభాగంలో టాపర్ గా నిలిచిన విద్యార్థి కూడా ఓ కూరగాయల వ్యాపారి కొడుకు కావడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.