బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు సంఘటితమై భారత్ బంద్ చేపట్టనున్నారు. ట్రేడ్ యూనియన్లు సోమ, మంగళవారాల్లో (ఈనెల 28, 29 తేదీల్లో) భారత్ బంద్ కు పిలునిచ్చాయి. ఈ సమ్మెలో తాము కూడా పాల్గొంటున్నట్లు బ్యాంక్ ఉద్యోగుల యూనియన్లు ప్రకటించాయి. మొత్తంగా సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన 20 కోట్ల మంది సమ్మెలో పాల్గొనొచ్చని సంఘాలు చెబుతున్నాయి. దీంతో రెండు రోజులపాటు దేశంలో బ్యాంకింగ్ సహా ఇతర సర్వీసులకు అతరాయం ఏర్పడనుంది.
గతవారం ఢిల్లీ కేంద్రంగా సమావేశమైన కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం తెలిసిందే. కార్మిక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు రెండు రోజుల పాటు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు సంఘాలు పేర్కొన్నాయి. రవాణా, విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సహా పలు రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలో భాగం కానున్నారు. విద్యుత్ కు అధిక డిమాండ్ ఉండే వేసవిలో ఆ విభాగానికి చెందిన సిబ్బంది సమ్మెకు దిగుతుండటంతో సోమ, మంగళవారాల్లో కరెంటు సరసఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా ప్రభుత్వాలు ఎక్కడికక్కడే చర్యలు చేపట్టాయి.
ప్రైవేటీకరణ, ఇంధన ధరల పెంపు, ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు 48 గంటల బంద్కు నిర్ణయించాయి. కేంద్ర నిర్ణయాలతో సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్త సమ్మెలో బ్యాంకింగ్ రంగం పాల్గొంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ క్రమంలో 28, 29 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నాయి.
ఉద్యోగులు, కార్మికుల సమ్మె కారణంగా పని ప్రదేశాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ.. పరిమిత స్థాయిలో సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. సమ్మెలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ పాల్గొనబోతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Banking, Bharat Bandh, Employees, Farmers