పంజాబ్ లో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికే తొలి ప్రాధాన్యం ఇస్తానన్న కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. పీఠమెక్కిన ఐదోరోజే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కారు ఏర్పాటై ఐదు రోజులైనా తిరక్కముందే, కొత్త కేబినెట్ కొలువుదీరిన తొలిరోజే నిరుద్యోగులకు భారీ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మాన్ కేబినెట్ ఆమోదముద్రవేసింది. శనివారం ఉదయం మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత మధ్యాహ్నం కొత్త కేబినెట్ తొలి భేటీ జరగ్గా.. ఆ సమావేశంలో ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నలిచ్చారు..
పంజాబ్ లో నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నది ఆప్ తన మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది. ఏడాదిలోపే ఖాళీలను భర్తీ చేస్తామని, వీలున్న శాఖల్లో కొత్త పోస్టులు సృష్టిస్తామని చెప్పినట్లుగానే తొలి విడతలో ఏకంగా 25వేల ఖాళీల భర్తీకి సిద్ధమైంది. భగవంత్ మాన్ కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపిన 25వే పోస్టుల్లో 10వేలు పంజాబ్ పోలీస్ విభాగంలోనివి కాగా, మిగతా 15 వేల ఖాళీలు వివిధ శాఖలకు చెందినవి. కేబినెట్ తొలి సమావేశంలోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోవడం గర్హనీయమని సీఎం, మంత్రులు పేర్కొన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ భారీ విజయాన్ని నమోదుచేసుకుని ప్రభుత్వంలోకిరాగా, ఈనెల 16న ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణం చేశారు. ఇవాళ (శనివారం) మంత్రివర్గంలోకి 10 మందిని తీసుకోగా వారితో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ప్రమాణస్వీకారాలు చేయించారు. మాన్ కేబినెట్ లోని 10 మంది మంత్రుల్లో ఒకే ఒక్క మహిళకు అవకాశం దక్కింది.
పంజాబ్ కేబినెట్ మంత్రులుగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. హర్పాల్ సింగ్ చీమా, డాక్టర్ బల్జీత్ కౌర్, హర్బజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింగ్లా, లాల్ చంద్, గుర్మిత్ సింగ్, కుల్దీప్ సింగ్ ధలివాల్, లల్జిత్ సింగ్ భుల్లార్, బ్రామ్ శంకర్(జింపా), హర్జోత్ సింగ్ బెయిన్స్లు ఉన్నారు. కొత్త కేబినెట్లో హర్జోత్ సింగ్ బెయిన్స్ అత్యంత యువ మంత్రి కావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.