భారతదేశంలోని (India) చాలా మారుమూల గ్రామాల్లో రోడ్లు, ఎలక్ట్రిసిటీ వంటి సదుపాయాలేవీ ఉండవు. అడవిలో విసిరేసినట్టు ఉండే మారుమూల గ్రామ ప్రజలు విద్యుత్తు లేకుండానే కాలం వెళ్లదీస్తుంటారు. కానీ కొందరు గ్రామస్తులు మాత్రం తమ తెలివితో ఇలాంటి సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుగొంటారు. తాజాగా కర్ణాటక లోని (Karnataka) ఓ చిన్న గ్రామంలోని ప్రజలు కూడా కరెంటు కష్టాలకు మంగళం పాడేందుకు గొప్ప పరిష్కారం కనిపెట్టారు. హైడ్రోఎలక్ట్రిక్ సెటప్తో వారు కరెంటు సమస్యలను పరిష్కరించడమే గాక రోజులో 24 గంటలూ సంవత్సరంలో 365 రోజుల పాటు ఉచితంగా కరెంటు పొందుతున్నారు. మొన్నటిదాకా కరెంటు లేక వెలవెలబోయిన ఈ చిన్న గ్రామం ఇప్పుడు 24x7 నిరంతరాయ కరెంటుతో కాంతులీనుతోంది. ఆ గ్రామంలో కరెంటు ఎలా ఉత్పత్తి అవుతుంది? అదీ ఉచితంగా గ్రామస్తులు ఎలా కరెంటు పొందుతున్నారు? లాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
దక్షిణ కన్నడ, మడికేరి జిల్లా సరిహద్దులో చెంబు అనే చిన్న గ్రామం ఉంది. ఈ ఊరి చుట్టూ దట్టమైన అడవులు, నిత్యం ప్రవహించే నీటి ప్రవాహాలు ఉంటాయి. అయితే తమ గ్రామంలో విద్యుత్ సదుపాయం కల్పించాలని అక్కడి ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేసేవారు. కానీ గ్రామం చుట్టూ అటవీ శాఖకు చెందిన భూములు ఉండటంతో మంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేకపోతోంది. ఈ చిన్న గ్రామానికి ఇప్పటి వరకు ఏ సరఫరాదారుల కూడా విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకు రాలేదు.
అయితే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఈ సమస్యను సొంతంగా సాల్వ్ చేయాలనుకున్నారు ఊరి ప్రజలు. ఇందుకు కరెంటును తమ ఊరిలోనే ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు. అనంతరం వాగుల్లోకి పెద్ద పైపులు వేసి నీటిని తమ పెరట్లోకి మళ్లించుకున్నారు. అక్కడ టర్బైన్లు అమర్చారు. వాగుల్లోనుంచి పైపుల ద్వారా వచ్చే నీరు ఈ టర్బైన్లపై బలంగా పడేలా సెటప్ చేశారు. అలా నీటి బలం వల్ల టర్బైన్లు వాటంతటవే తిరుగుతున్నాయి. ఈ టర్బైన్లకు ఒక జనరేటర్ ను కనెక్ట్ చేశారు. అయితే నీరు పడిన ప్రతిసారి టర్బైన్లు తిరగడం వల్ల జనరేటర్ ద్వారా కరెంట్ అనేది నిత్యం ఉత్పత్తి అవుతూనే ఉంది. దాంతో ఆ విద్యుత్ను ఎంచక్కా వాడుకుంటున్నారు ఊరి ప్రజలు.
గ్రామంలోని 80% ఇంటి యజమానులు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. వీరు చిన్న తరహా జలవిద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన రుణాలు, సబ్సిడీలను గ్రామ పంచాయతీ సహాయంతో పొందగలిగారు. మొత్తం జలవిద్యుత్ ఉత్పత్తి/ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సెటప్కు దాదాపు 30 నుంచి 50 వేల రూపాయలు ఖర్చవుతుంది. వర్షాకాలంలో గ్రామస్తులు పగలు, రాత్రి వేళల్లో టర్బైన్ను నిరంతరాయంగా నడుపుతారు. వేసవిలో మాత్రం వారు నీటిని తమ పొలాలకు వదిలి రాత్రిపూట తమ పెరట్లకు మళ్లిస్తారు. ఈ విధంగా వారు వ్యవసాయ, విద్యుత్ అవసరాలకు నీటిని చాకచక్యంగా వాడుకుంటున్నారు. గ్రామస్తులు తమ అవసరాలకు అనుగుణంగా 1 కెవి, 2 కెవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం పట్ల ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు.
“మా ఇంట్లో ఇప్పుడు లైట్లు, మిక్సర్ గ్రైండర్, వాటర్ పంప్, వెట్ గ్రైండర్, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్, టెలివిజన్, అవసరమైన ప్రతి విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ వస్తువులను కొనుగోలు చేయలేకపోయే వాళ్లం. ఆర్థిక స్థోమత వల్ల కాదు, విద్యుత్ లేకపోవడం వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు మాకు ఏ విద్యుత్ బోర్డు సహాయం అక్కర్లేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్లకు మంచి గుణపాఠం చెప్పాం కదా?" అని చెంబు గ్రామ నివాసి జనార్దన్ గర్వంగా చెప్పాడు.
“నేను మారుమూల గ్రామంలో నివసిస్తున్నప్పటికీ సంతృప్తిగా ఉన్నాను. ఈ ఊరిలో కరెంటు కట్ సమస్యలే లేవు. టీవీ సీరియల్స్ ని ఎప్పుడూ మిస్ కాను. దీనికి కారణమైన గ్రామపంచాయతీకి, అందరికి కృతజ్ఞతలు” అని సావిత్రి అనే గ్రామ నివాసి సంతోషం వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఎవరి సాయం లేకుండా ఉచితంగా సంవత్సరం పొడుగూతా రోజులో 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ చెంబు గ్రామ ప్రజలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Karnataka, Power cuts