బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ 31లోపు కేసుపై విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని స్పష్టం చేసింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసులో విచారణ లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. దీనిపై ఆగస్ట్ 31లోపు తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించింది. తొమ్మిది నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ఆ గడువు ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. దీంతో మరోసారి సుప్రీంకోర్టు లక్నో కోర్టుకు గడువు పొడిగించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రభావం కేసు విచారణ మీద కూడా పడిందని, మరికొంత గడువు ఇవ్వాలంటూ సీబీఐ కోర్టు జడ్జి సుప్రీంకోర్టును కోరారు. జడ్జి లేఖను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం ఆగస్ట్ 31 వరకు గడువును పొడిగించింది. అవసరం అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని, ఈ సారి ఆగస్ట్ 31 గడువును మాత్రం దాటొద్దని స్పష్టం చేసింది.
బాబ్రీ మసీదు కేసులో బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు మరికొందరిపై ఆరోపణల విచారణకు సుప్రీంకోర్టు 2017లో రెండు సంవత్సరాల గడువు ఇచ్చింది. ఆ రెండేళ్ల గడువు 2019లో ముగిసింది. ఆ తర్వాత మరో తొమ్మిది నెలల గడువును ఇచ్చింది సుప్రీంకోర్టు. అది కూడా ముగియడంతో ఇప్పుడు నాలుగు నెలల సమయాన్ని పొడిగించింది. మరోవైపు ఈ కేసు విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టు జడ్జి ఎస్కే యాదవ్ 2019లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కేసు కోసం ఆయన పదవీకాలాన్ని కూడా పొడిగించారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి రాయ్ బరేలీ, లక్నోలో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రెండు క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు కలిపేసింది. రెండింటినీ కలిపి సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేసింది. రోజువారీ పద్ధతిలో విచారణ జరపాలని సూచించింది. బీజేపీ నేతలు, రైట్ వింగ్ లీడర్స్ జాతి సమైక్యతను దెబ్బతీసేలా, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయారంటూ రాయ్ బరేలీలో కేసు నమోదైంది. అలాగే, గుర్తు తెలియని కరసేవకుల మీద లక్నోలో మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసులను కలిపి సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరుపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babri masjid