అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు తరహాలో తాను కూడా గౌరవిస్తానని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కోర్టు తీర్పు మీద AIMLB సంతోషంగా లేదని, తన అభిప్రాయం కూడా అదేనన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్. కానీ, న్యాయస్థానం పొరపాటుపడదని లేదు. ఎవరైనా బాబ్రీమసీదును కూల్చారో వారికే అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 6న మసీదును కూల్చకపోతే కోర్టు తీర్పు ఎలా ఉండేది? మసీదు అక్కడే ఉండి ఉంటే ఏం తీర్పు చెప్పేది?’ అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని ట్రస్ట్కు అప్పగించాలని కోర్టు సూచించింది. దీంతోపాటు ముస్లింలకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయంపై అసదుద్దీన్ విబేధించారు. ‘మసీదు కట్టుకోవడానికి భూమి లేక మేం పోరాటం చేయలేదు. మా న్యాయపరమైన హక్కు కోసం ఫైట్ చేస్తున్నాం. మాకు ఎవరో ఇచ్చే భూమి అవసరం లేదు. నేను ఈ రోజు హైదరాబాద్లో జోలెపట్టుకుంటే యూపీలో ఐదెకరాల భూమి కొనగలిగేంత సొమ్మును దాతలు అందిస్తారు. మాకు ఎవరి బిక్ష అవసరం లేదు.’ అని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ఐదెకరాల ప్రత్యామ్నాయ భూమిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించాలని సూచించారు. తీర్పు తర్వాత ఎలాంటి ఆందోళనలు లేకుండా చూడాలని అసదుద్దీన్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.