అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణం తర్వాత మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ మధ్య తెలంగాణలోని ములుగులో పోలీసుల ఎన్ కౌంటర్ లో ముగ్గురు కీలక నేతలు చనిపోగా, ఉత్తరాదిలో పలువురు సీనియర్ నేతలను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లోనూ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. వివరాలివి..
మహారాష్ట్రలో పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందాలకు, మావోయిస్టులకు మధ్య భీకర్ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు బలగాలు తెలిపాయి.
చలికాలం సమీపిస్తుండటంతో మహారాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల వేటను ముమ్మరం చేశాయి. ఈక్రమంలోనే గడ్చిరోలిలోని గ్యారపట్టి అటవీ ప్రాంతంలో బలగాలు శనివారం కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని, ప్రతిగా తాము కూడా ఎదురుకాల్పులు జరిపామని భద్రతా బలగాల ప్రతినిధులు చెప్పారు.
గ్యారపట్టి అటవీ ప్రాంతంలో కొద్ది గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయని, కాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతంలో ఏడుగురు మావోయస్టుల మృతదేహాలను గుర్తించామని, ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని, పారిపోయిన మావోయస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నామని మహారాష్ట్ర పోపలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు,
దివంగత మావోయిస్టు నేత ఆర్కేకు సంబంధించి హైదరాబాద్ లో పెను కలకలం చోటుచేసుకుంది. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే జీవిత చరిత్రను ముద్రిస్తున్న ప్రింటింగ్ ప్రెస్పై పోలీసులు దాడి చేశారు. నిషేధిత సాహిత్యంతో పుస్తకం ముద్రిస్తున్నారనే అభియోగంపై.. నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Encounter, Maharashtra, Maoist, Naxals