‘నిత్యవిద్యార్థి’ అనే పదానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తూ, చదువుకోవాలనే ఆసక్తికి వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని నిరూపిస్తోంది ఓ 96 ఏళ్ల ముసలమ్మ. నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ ఏ వయసులోనే అక్షరాలు దిద్దవచ్చని నిరూపించి, విద్యార్థులందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఈ వృద్ధురాలి పేరు కార్తియని అమ్మ. కేరళ రాష్ట్రం అక్షరాస్యత మిషన్లో భాగంగా నిర్వహిస్తున్న ‘అక్షరలక్ష్యం’ ప్రాజెక్ట్లో చేరిన ఈ పండు ముసలి... ఈ ప్రోగ్రామ్లో చేరిన అతిపెద్ద వయస్కురాలిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో ఏకంగా నూటికి 98 మార్కులు సాధించి, తనతోటి విద్యార్థులకు స్వీట్ షాక్ ఇచ్చింది కార్తియని అమ్మ.
కేరళ రాష్ట్రం నూటికి నూరు అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ‘అక్షరలక్ష్యం’ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా బడి వయసు దాటిన వారికి చదవడం, రాయడంతో పాటు లెక్కలు కూడా నేర్పిస్తారు. ఈ ప్రాజెక్ట్లో అలప్పుజా జిల్లాకి చెందిన 96 ఏళ్ల కార్తియని అమ్మ చేరింది. కొద్దికాలం కిందట ఈ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్నవారికి పరీక్షలు నిర్వహించింది కేరళ ప్రభుత్వం. తాజాగా విడుదల చేసిన ఈ పరీక్ష ఫలితాల్లో కార్తియని అమ్మకు నూటికి 98 మార్కులు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో కార్తియని అమ్మ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. కొందరు ‘నిత్యవిద్యార్థి’ అనే మాటకు అమ్మే సాక్ష్యం అంటుంటే... మరికొందరు ఆమె పరీక్ష రాస్తున్న సమయంలో పక్కనే ఉన్న ముసలాయనకి సమాధానాలు చూపించి, కాపీ కొట్టడంలో సాయం చేసిందంటూ అప్పటి ఫోటోలు ట్వీట్ చేస్తున్నారు. ఈ పరీక్షల్లో 42933 మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala