దిష్పూర్: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అస్సోం బీజేపీ అధ్యక్షుడు భబేష్ కలిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 200 రూపాయలకు చేరుకుంటే టూ-వీలర్పై ట్రిపుల్ రైడింగ్కు అనుమతించాలని ప్రభుత్వాన్ని సూచిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పెట్రోల్ లీటర్ ధర రూ.200కు చేరుకున్నప్పుడు టూ-వీలర్ వెహికల్ తయారీ సంస్థలు కూడా ముగ్గురు కూర్చునేందుకు వీలుగా వాహనాలను తయారు చేయాలని అస్సోం బీజేపీ చీఫ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దీంతో.. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు ముగ్గురు బయటకు వెళ్లాల్సి వస్తే కారుకు బదులుగా బైక్పై వెళుతున్నారని చెప్పడమే తన వ్యాఖ్యల ఉద్దేశమని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. దేశంలో పెట్రోల్ ధర కొన్ని రోజుల క్రితమే లీటర్ 100 రూపాయలు దాటింది. అస్సాంలో కూడా లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు పైగానే ఉంది. గౌహతిలో అక్టోబర్ 18న లీటర్ పెట్రోల్ రూ.102.12గా ఉండగా, లీటర్ డీజిల్ రూ.94.70గా ఉంది. ఎల్పీజీ కూడా గౌహతిలో 948.50 వద్ద ఉంది.
వంట గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంపై సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్రంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అస్సోంకు చెందిన కాంగ్రెస్ మహిళా నేత అంకిత దత్తా తన ట్విట్టర్లో ప్రధాని మోదీని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఓ పెట్రోల్ బంక్ వద్ద తన కారులో ఇంధనం నింపించుకునేందుకు వెళ్లిన ఆమె పెట్రోల్, డీజిల్ ధరలను చూపుతూ.. ‘థ్యాంకూ మోదీ జీ. ఎంత గొప్ప రోజో ఇవాళ. అంగురిలో నా కారుకు ఇంధనం కోసం వచ్చాను. డీజిల్ లీటర్ రూ.95.13గా, పెట్రోల్ అయితే ఏకంగా రూ.102.71గా ఉంది’ అని ఆమె ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assam, Bjp, Fuel prices, Petrol Price