ఒడిశా (Odisha)లో ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయానికి (Shree Jagannath Temple) ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచి పురాతన ఆలయం. ఏటా జరిగే పూరి రథోత్సవానికి ప్రపంచంన నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పూరీ ఆలయంలో భారీ మొత్తంలో నేల మాళిగలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత పురావస్తు శాఖ పూరీ జగన్నాథ ఆలయంలో ఉన్న రత్న భాండాగారాన్ని తెరవాలని శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SJTA)కి లేఖ రాసింది.
12వ శతాబ్దం నాటి ఈ రత్న భాండాగారం లోపలి స్థితిని అధ్యయనం చేయాలని, మరమ్మతులు తప్పనిసరిగా చేపట్టాల్సి ఉందని సూచించింది. ఈ మేరకు SJTA పాలనాధికారితో పాటు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శికి కూడా లేఖలు రాసింది. చాలా కాలంగా రత్న భాండాగారం తెరవనందున... లోపలి పరిస్థితి ఎలా ఉందో స్పష్టత లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరవాలని 2018లో హైకోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది. కానీ రత్న భాంగాగారం రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కేవలం కిటికీ ద్వారా వెలుపల నుంచి మాత్రమే పరిశీలించారు. రహస్య గది పైకప్పుల పెచ్చులు ఊడడంతో పాటు గోడల్లో తేమ ఉందని నిపుణుల బృందం గుర్తించింది. ఈ క్రమంలో రత్న భాండాగారంపై సమగ్ర అధ్యయనం చేపట్టిన పురావస్తు శాఖ... మరమ్మతు చేపట్టాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది. అందువల్ల రహస్య గది తలుపులు తెరవాల్సిన అవసరం ఉందని జగన్నాథ్ ఆలయ యంత్రాంగానికి లేఖ రాసింది.
పూరీ జగన్నాథునికి 12వ శతాబ్దంలో పూరీ రాజులు, భక్తులు కానుకగా ఇచ్చిన 800కు పైగా విలువైన వస్తువులు, ఆభరణాలు రత్న భాండాగారంలో ఉన్నట్లు ప్రచారం ఉంది. 1926 ఫిబ్రవరిలో పూరీ రాజు గజపతి రామచంద్రదేవ రూపొందించిన జాబితా ప్రకారం... 15 కిలోల కంటే ఎక్కువ బరువున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రల బంగారు కిరీటాలతో పాటు 837 విలువైన వస్తువులు ఉన్నాయి. ఈ రహస్య నిధిలో బంగారు హారాలు, విలువైన రత్నాలు, బంగారు పలకలు, ముత్యాలు, వజ్రాలు, పగడపు మరియు వెండి వస్తువులు ఉన్నాయి. జగన్నాథ ఆలయ చట్టం ప్రకారం... ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రత్న భండార్ను ఆడిట్ చేయాలి. ఐతే కానీ ఆడిట్ సమయంలో ఏదైనా విలువైన వాటి వివరాలలో అవక తవకలు జరిగితే.. అది ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్న భయంతో.. ఆడిట్కు దూరంగా ఉంటున్నాయి.
ఐతే రత్న భాండాగారంలో ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా? అని ఎంత మంది భక్తులు అనుమానం వ్యక్తం చేశారు. వాటిని లెక్కించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. పురాతన నివేదికలు ఉన్న వివరాల మేరకు ఆభరణాలన్నీ ఉన్నాయో.. లేదో చెప్పాలని కోరుతున్నాయి. రహస్య మందిరం తలుపులు తెరిస్తే ఖచ్చితంగా లెక్కింపు జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు. రత్న భండాగారం తలుపులు తెరిచే అంశంపై ఒడిశా అసెంబ్లీలో గతంలో చర్చ కూడా జరిగింది. ఈ క్రమంలో రత్న భాండాగారాన్ని తెరవాలని పురవాస్తు శాఖ ఆదేశాలివ్వడం.. హాట్ టాపిక్గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Odisha, Odisha news, Puri jagannath