ARVIND KEJRIWAL PRAISES PUNJAB CM AFTER ARREST OF MINISTER VIJAY SINGLA PVN
Kejriwal : నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి..పంజాబ్ మంత్రి అరెస్ట్ తర్వాత సీఎంపై కేజ్రీవాల్ ప్రశంసలు
పంజాబ్ సీఎం భగవంత్ మాన్-ఆప్ అధినేత కేజ్రీవాల్(ఫైల్ ఫొటో)
Kejriwal praises Punjab CM :పంజాబ్(Punjab)లో ఇటీవలే అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తన పరిపాలనలో అవినీతికి చోటివ్వబోనని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా.. లంచాల ఉదంతంలో మొట్టమొదటి నిందితుడిగా సొంత పార్టీ మంత్రినే జనం ముందు నిలబెట్టింది
Kejriwal praises Punjab CM :పంజాబ్(Punjab)లో ఇటీవలే అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తన పరిపాలనలో అవినీతికి చోటివ్వబోనని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా.. లంచాల ఉదంతంలో మొట్టమొదటి నిందితుడిగా సొంత పార్టీ మంత్రినే జనం ముందు నిలబెట్టింది. అవినీతి ఆరోపణలపై పంజాబ్ ఆరోగ్య మంత్రి(Health Minister)విజయ్ సింగ్లా పదవి కోల్పోయారు. కేబినెట్ నుంచి మంత్రిని తొలగిస్తూ సీఎం భగవంత్ మాన్(CM Bhagwanth Maan)మంగళవారం సంచలన ప్రకటన చేశారు. పదవి కోల్పోయిన కాసేపటికే అవినీతి కేసులో విజయ్ సింగ్లాను పోలీసులు అరెస్టు చేశారు. “ఇటీవల నాకొక ఫిర్యాదు వచ్చింది. నా ప్రభుత్వంలోని ఒక మంత్రి ప్రతి టెండర్కు 1% కమీషన్ డిమాండ్ చేస్తున్నారు. దానిని చాలా సీరియస్గా తీసుకున్నా. దీని గురించి ఎవరికీ తెలియలేదు, నేను కోరుకున్నట్లయితే, దానిని ఎవరికీ తెలియకుండా చేయొచ్చు. నాపై విశ్వాసం ఉంచిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లు అవుతుంది. ఒక శాతం అవినీతిని కూడా సహించబోం. ప్రజలు ఎన్నో ఆశలతో ఆప్ ప్రభుత్వానికి ఓటు వేశారు, దానికి అనుగుణంగా జీవించాలి. భారతమాతకి అరవింద్ కేజ్రీవాల్ వంటి కుమారుడు, భగవంత్ మాన్ వంటి సైనికుడు ఉన్నంత వరకు, అవినీతిపై మహా యుద్ధం కొనసాగుతుంది. విజయ్ సింగ్లాపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశా. తన శాఖలో ఆయన అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి పాల్పడినట్లు ఆయన అంగీకరించారు కూడా. తమ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించదు’’అని వీడియో సందేశంలో సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను చూసి గర్వపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీఎం భగవంత్ మాన్ తలుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని కప్పిపుచ్చగలరని, కానీ అలా చేయలేదన్నారు. ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కేజ్రీవాల్..."భగవంత్ మాన్…తమర్ని చూసి ఎంతో గర్విస్తున్నా. మీ చర్యతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమ్ ఆద్మీని చూసి దేశం మొత్తం గర్విస్తోంది. ఈ అవినీతి గురించి ఎవ్వరికీ ఉప్పందలేదు. అటు మీడియాకు గానీ, ఇటు విపక్షానికి గానీ అసలు సమాచారమే లేదు. భగవంత్ మాన్ తలుచుకుంటే ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చేవారే కాదు. కానీ సీఎం అలా చేయలేదు. మంత్రిపై చర్యలు తీసుకున్నారు" అని పేర్కొన్నారు. సొంత వారిపై చర్య తీసుకునే చిత్తశుద్ధి, ధైర్యం, నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ ఆప్ మాత్రమే అని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా అన్నారు. కాగా,ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కూడా 2015లో అవినీతి ఆరోపణలు వచ్చిన నెపంతో ఒక మంత్రిని ఇలాగే పదవి నుంచి తప్పించారు.
ఈ ఏడాది మార్చిలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పంజాబ్ లో ఆప్ అద్భుతమైన విజయాన్ని సాధించడం తెలిసిందే. 117 స్థానాలకు గానూ ఏకంగా 92 సీట్లలో ఆప్ గెలుపొందగా, సీనియర్ నేత భగవంత్ మాన్ సీఎం పదవి చేపట్టారు. అవినీతి నిర్మూలనకు తొలి ప్రాధాన్యం ఇస్తామన్న విధంగానే సొంత మంత్రినే తొలగించడం సంచలనంగా మారింది. రాజకీయాల్లో నిజాయితీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే నిదర్శనమని, తప్పుచేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమనడానికి పంజాబ్ మంత్రి తొలగింపు మరో ఉదాహరణ అని ఆప్ నేతలు ప్రకటనలు చేశారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.