కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో వేగంగా విస్తరిస్తుండటం, అదే సమయంలో డెల్టా ఇతర వేరియంట్లు మళ్లీ తిరగబెట్టడం, రోజువారీ కేసులు తిరిగి 30వేల దగ్గరకు వస్తుండటం, జనవరి చివరి వారం నాటికి రోజువారీ కేసులు 2లక్షలకు చేరొచ్చనే అంచనాల నడుమ దేశం దాదాపు లాక్ డౌన్ దిశగా వెళుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూతోపాటు పగటి పూట వ్యాపార కలాపాలు, కార్యాలయాల్లో పనులపై ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తాజాగా న్యాయ వ్యవస్థపైనా పడింది. కొవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని మరోసారి మూసేయాలని నిర్ణయించారు. ఇక వాదనలను నేరుగా కాకుండా వర్చువల్ గానే జరపాలని సర్క్యులర్ సైతం జారీ చేశారు. వివరాలివి..
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రెండు వారాల పాటు కోర్టులో నేరుగా విచారణలు జరుపరాదని, కేవలం వర్చువల్గానే కేసుల పరిశీలన ఉంటుందని సుప్రీం కోర్టు నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మేరకు ఆదివారం సర్క్యులర్ను జారీ చేశారు. సుప్రీంకోర్టు స్టాండర్డ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)కి సంబంధించి గత ఏడాది అక్టోబరు 7న జారీ చేసిన సర్క్యులర్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని కొత్త ప్రకటనలో పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచీ సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే కేసుల్ని విచారించింది. అయితే.. బార్ సంఘాలు, న్యాయవాదుల డిమాండ్ మేరకు గత ఏడాది అక్టోబరు 7న కొత్త సర్క్యులర్ను జారీ చేసింది. సుదీర్ఘ విచారణ అవసరమైన కేసులను బుధ, గురువారాల్లో ప్రత్యక్షంగా కోర్టులోనే చేపడతామని అందులో స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసుల పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేసింది. ఇక,
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకా పెరిగింది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 123 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1711కు పెరిగింది. అత్యధికంగా మహారాష్ట్రలో 510, కేరళలో 152, ఒడిశాలో 37, తెలంగాణలో 84 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడులోనూ ఒమిక్రాన్ కేసులు భారీగా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.