న్యూఢిల్లీ: సీడీఎస్ హెలికాఫ్టర్ ప్రమాద (CDS Chopper Crash) దుర్ఘటనపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రకటించారు. ఎయిర్ మార్షల్ మన్వీంద్ర సింగ్ (Manvendra Singh) నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరపనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ వెల్లడించారు. వాతావరణం అనుకూలించకే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ ఈ దుర్ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో ఈ కమిటీ విచారణ జరపనుంది.
ఇప్పటికే తమిళనాడు (Tamilnadu) ఫోరెన్సిక్ బృందం ఈ ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి కీలక ఆధారాలు సేకరించాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్ కూడా లభ్యమైంది. ఐఏఎఫ్ ఆ బ్లాక్ బాక్స్ను (Black Box) స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా.. లోక్సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రమాద ఘటనపై కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఆయన ప్రధానంగా ఏం చెప్పారంటే..
లోక్సభలో హెలికాఫ్టర్ ప్రమాద ఘటనపై రాజ్నాథ్ చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు:
* డిసెంబర్ 8 మధ్యాహ్నం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న మిలటరీ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది
* ఎయిర్ ఫోర్స్కు చెందిన Mi 17 V 5 Helicopter ఉదయం 11.48 నిమిషాలకు సూలూరు నుంచి టేకాఫ్ అయింది
* వెల్లింగ్టన్లో మధ్యాహ్నం 12.15కు ల్యాండ్ అవ్వాల్సి ఉంది
* కానీ 12.08 నిమిషాలకు సూలూరు ఎయిర్ బేస్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో హెలికాఫ్టర్కు సంబంధాలు తెగిపోయాయి
* ఆ సమయంలో కూనూరు అటవీ ప్రాంతంలో మంటలు రేగడాన్ని కొందరు స్థానికులు గమనించారు
* అక్కడికి వెళ్లి చూసేసరికి మిలటరీ హెలికాఫ్టర్ చెట్టుపై కూలి మంటల్లో కాలిపోతూ కనిపించింది
* సహాయక సిబ్బందికి సమాచారం అందించడంతో అధికార యంత్రాంగం అందరినీ అప్రమత్తం చేసింది
* హెలికాఫ్టర్లో చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది కాపాడే ప్రయత్నం చేశారు
* మంటల్లో చిక్కుకుని గాయపడిన వారిని వెల్లింగ్టన్ ఆసుపత్రికి తరలించారు
* ఈ ఘటనలో దురదృష్టవశాత్తూ 13 మంది ప్రాణాలు కోల్పోయారు
* ఈ దుర్ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య మధులిక రావత్, డిఫెన్స్ అడ్వైజర్ లఖ్వీందర్ సింగ్, స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్, మరో 9 మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, జూనియర్ వారంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్, జూనియర్ వారంట్ ఆఫీసర్ అరక్కల్ ప్రదీప్, హవ్లీదార్ సత్పాల్ రాయ్, నాయక్ గురుసేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బీ సాయి తేజ ఉన్నారు
* ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలటరీ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు శాయశక్తులా కృషి చేస్తున్నారు
* ఈ ప్రమాద ఘటనపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ విచారణ జరుపుతోందని, ఎయిర్ మార్షల్ మన్వీంద్ర సింగ్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరపనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ ప్రకటించారు
* చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కు మిలటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని, చనిపోయిన వారికి సంతాపం తెలుపుతున్నట్లు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన ప్రకటనను ముగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bipin Rawat, Helicopter, Helicopter Crash, Lok sabha, Rajnath Singh