90వ దశకంలో జమ్మూకాశ్మీర్ నుంచి బ్రాహ్మణులైన కాశ్మీరీ పండితులు నిర్గమణం అంశాన్ని కథా వస్తువుగా తీసుకొని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వివాదాలు మరింత ముదురుతున్నాయి. పండిట్ల నిర్గమణకు పాక్ ప్రేరిత టెర్రరిస్టులే కారణమని, నాటి హింసలో బ్రాహ్మణేతర కులాలకు చెందిన హిందువులతోపాటు ముస్లింలు కూడా బలైపోయారని, అలాంటిది సినిమాలో అసత్యాలను, బీజేపీ మార్కు మత విద్వేషాన్ని రంగరించారని సాక్ష్యాత్తూ కాశ్మీరీ పండిట్లే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కమలదళం మాత్రం ఈ సినిమాను ఓన్ చేసుకుంది. కాశ్మీర్ ఫైల్స్ చూడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన తర్వాత, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ సినిమాకు పన్ను మినహాయింపులు ప్రకటించాయి. ఈ క్రమాన్ని తప్పుపడుతూ, కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు వ్యతిరేకంగా గళం విప్పిన తొలి పెద్ద నేతగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు..
ద కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ఖండిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశంలోని ఇతర రాజకీయ నేతలూ ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. జమ్మూకాశ్మీర్కే చెందిన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో తమపై మరింత ద్వేషం నింపేందుకే ద కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారని ఆరోపించారు. దురుద్దేశంతోనే ఈ సినిమా తీశారని, దానికి బీజేపీ ప్రభుత్వాలు అండగా నిలబడుతున్నాయని విమర్శలు గుప్పించారు.
‘బీజేపీ పాలిత రాష్ట్రాలు కావాలనే ద కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి రాయితీలు ప్రకటిస్తూ, ప్రచారం కల్పిస్తున్నాయి. ప్రజలతోపాటు, సైనికులు, పోలీసులు తప్పనిసరిగా ఈ చిత్రాన్ని చూడాలని చెబుతున్నాయి. దీని ద్వారా ప్రజల్లో మాపై మరింత ద్వేషం పెంచాలనుకుంటున్నాయి. 1990 నాటి సంఘటనల్లో హిందువులు, ముస్లింలు అందరూ ఇబ్బందిపడ్డారు. దీని గురించి తలచుకుంటే ఇప్పటికీ నా గుండె బరువెక్కుతుంది. ఈఘటనల వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయి.
అప్పట్లో జర్మనీలో హిట్లర్, గోబెల్స్ పెంచుకున్న ద్వేషం వల్ల లక్షల మంది యూదులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ప్రచారం వల్ల ఇంకెంతమందికి ఆ పరిస్థితి వస్తుందో’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు. 1990లో కాశ్మీర్లో పండిట్లపైనే కాకుండా ముస్లింలు, సిక్కులకు కూడా ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఒక నిజ నిర్ధరణ కమిషన్ వేయాలని, ఒకవేళ పండిట్ల బహిష్కరణకు తానే బాధ్యుడినైతే బహిరంగంగా ఉరి తీయండని అబ్దుల్లా సవాలు విసిరారు.
బీజేపీ భారీగా ప్రచారం చేసుకుంటోన్న ద కాశ్మీర్ ఫైల్స్ సినిమాను నిరసించిన తొలి బడా నేతగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ఓట్ల రూపంలో సొమ్ము చేసుకొనేలా దుర్మార్గంగా బీజేపీ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాశ్మీర్ పండితులకు బీజేపీ చేసిందేమీ లేదని, ఉపశమనం కలిగించకపోగా వాళ్లను రాజకీయాల కోసం వాడుకొన్నదని విమర్శించారు. కశ్మీర్ ఫైల్స్ అనే ఫిలాసఫీని తిప్పి కొట్టాలన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలని, అవసరమైతే వ్యతిరేక ఉద్యమాలు నిర్మించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే,
కాశ్మీర్ పండిట్ల బహిష్కరణకు తాను బాధ్యుడినని తేలితే తనను దేశంలో ఎక్కడైనా ఉరితీయండని జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్ధుల్లా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. కాశ్మీర్ పండిట్ల బహిష్కరణకు ఫరూక్ అబ్దుల్లానే బాధ్యుడని, కాశ్మీర్ను హిందువులు 1989 నవంబర్ 1 నుంచి విడిచివెళ్లడం ప్రారంభించారని, 1990 జనవరి 18న జమ్మూ కాశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్ధుల్లా వైదొలగారని పేర్కొంటూ ఆయన తీసుకొచ్చిన మైగ్రేంట్ ఇమ్మూవబల్ ప్రాపర్టీ యాక్ట్ ఇమేజ్ను షేర్ చేశారు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.