దేశంలో శాంతిని నెలకొల్పేందుకు తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ పేర్కొన్నారు. ముస్లిం మత పెద్దలు చెన్నైలో రజనీకాంత్ను కలిశారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు తదితర అంశాలపై రజనీకాంత్తో వారు చర్చించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రజనీకాంత్..దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ఒక దేశం తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. దేశంలో శాంతి, సామరస్యం నెలకొనేందుకు తన వంతు పాత్ర పోషించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
ఈశాన్య ఢిల్లీలో గత వారం జరిగిన అల్లర్లపై రజనీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడం తెలిసిందే. కేంద్ర ఇంటెలిజన్స్ వైఫల్యం కారణంగానే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని పేర్కొన్నారు. హింసను ఆపలేని వారు పదవికి రాజీనామా చేయాలంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారానన్న విమర్శలు తనను ఆవేదనకు గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajnikanth