MIS-C: మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్... దీన్నే సింపుల్గా MIS-C అంటున్నారు. ఇది పిల్లలకు సోకుతున్న వ్యాధి. కరోనా నుంచి కోలుకొన్న 15 ఏళ్ల లోపు పిల్లలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతోంది. ఇది సోకినప్పుడు శరీరంలోని వివిధ భాగాల్లో మంట పుడుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెయిన్, చర్మం, కళ్లు, పొట్టలో అవయవాలకు ఈ మంట వస్తుంది. ఈ వ్యాధి కరోనా సోకిన పెద్ద వాళ్ల నుంచి కూడా పిల్లలకు సోకుతోంది. ఇలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికీ తెలియదని అమెరికాలో వ్యాధుల నియంత్రణ సంస్థ CDC చెప్పింది. కరోనా సోకిన పిల్లలకే ఇది సోకుతోందనీ... పిల్లల చుట్టుపక్కల ఎవరికైనా కరోనా ఉంటే.. అప్పుడు కూడా పిల్లలకు ఇది సోకుతోందని చెప్పింది. ఈ వ్యాధిని ఇలాగే వదిలేస్తే... ప్రాణాలు తీస్తుంది. ఐతే... దీనికి వెంటనే ట్రీట్మెంట్ అందిస్తే... పిల్లల్ని కాపాడుకోవచ్చని CDC తెలిపింది.
MIS-C సోకిన పిల్లలకు RT-PCR టెస్టులో కరోనా పాజిటివ్ వచ్చే ఛాన్సుంది. అలాగే... వారి శరీరంలో డీడైమర్, CRP, ఫెరిటిన్, LDH స్థాయులు పెరుగుతాయి. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తం గడ్డకట్టి పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. కాబట్టే... పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే... వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అలా తీసుకెళ్లిన పిల్లలకు ముందుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు IV ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తారు. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.
పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే... డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి:
జ్వరం
పొట్టలో నొప్పి
వాంతులు
విరేచనాలు (Diarrhea)
మెడనొప్పి
దద్దుర్లు (Rash)
ఎర్రబారిన కళ్లు (Bloodshot eyes)
అతి నీరసం (Feeling extra tired)
ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. పిల్లలందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కోరకమైనవి ఉంటాయి. పై లక్షణాల్లో ఒక్కటి కనిపించినా అప్రమత్తం అవ్వాల్సిందే.
మీరు వెంటనే అలర్ట్ అవ్వకపోతే... పిల్లల్లో వ్యాధి ముదిరి... నెక్ట్స్ లెవెల్ సమస్యలు వస్తాయి. అవి ఏవంటే...
- ఊపిరి సరిగా తీసుకోలేరు.
- రొమ్ము దగ్గర నొప్పి వస్తుంది. బలంగా నొక్కేస్తున్నట్లు ఉంటుంది. ఆ నొప్పి పోదు.
- అయోమయం అవుతూ ఉంటారు.
- స్పృహ కోల్పోతూ ఉంటారు. మీరు యాక్టివ్గా ఉండమని చెప్పినా ఉండలేరు.
- చర్మం రంగు మారిపోతుంది. బ్లూకలర్ లోకి వచ్చేస్తుంది. పెదవులు, గోర్లు కూడా రంగు మారతాయి.
- కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది.
డాక్టర్లు ఎలా కాపాడుతారో తెలుసుకుందాం.
మీరు డాక్టర్ దగ్గరకు చిన్నారిని తీసుకెళ్లగానే... ముందుగా వాళ్లు మంట ఎక్కడెక్కడ ఉంది... వ్యాధి తీవ్రత ఎలా ఉందో తెలుసుకుంటారు. అందుకోసం ఈ టెస్టులు చేస్తారు.
- బ్లడ్ టెస్టులు,
- రొమ్ము ఎక్స్రే (chest x-ray)
- గుండెకు అల్ట్రాసౌండ్ (echocardiogram)
- పొట్టకు అల్ట్రాసౌండ్ (Abdominal ultrasound)
డాక్టర్లు ఆయా లక్షణాలు తగ్గేందుకు మందులు, ఫ్లూయిడ్లూ ఇస్తారు. మంటను తగ్గిస్తారు. సాధారణంగా MIS-C సోకిన పిల్లల్ని ఆస్పత్రికి తీసుకెళ్లాక నయం అవుతోంది. కొంత మంది పిల్లలకు మాత్రం ICU ట్రీట్మెంట్ అవసరం అవుతోంది.
ఇది కూడా చదవండి: Plant Health: ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే... ఆరోగ్యమే ఆరోగ్యం...
సో... పేరెంట్స్గా పిల్లల్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు వాళ్లను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకోవచ్చు. వాళ్లను బయటకు పంపకండి. వాళ్లు ఎవరైనా కరోనా పేషెంట్ని కలిస్తే... MIS-C వచ్చే ప్రమాదం ఉంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19