Anti-Inflammatory Foods: వ్యాధులతో పోరాడేందుకు మన శరీరానికి వేడి, మంట అవసరం. ఐతే ఇది ఎక్కువైతే ప్రమాదమే. అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, నీటిలో కరిగిపోయే కొవ్వు వంటివి శరీరంలో వేడి, మంటను పెంచుతాయి. ఈ కారణంగానే ఇన్ఫ్లమేటరీ సమస్యలు ఉన్నవారు లో-షుగర్ డైట్స్ని వాడుతుంటారు. ఐతే కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరంలో వేడి, మంట, వాపులు, నొప్పులను సహజసిద్ధంగా తగ్గిస్తాయి. అవేంటో తెలుసుకొని... ఆరోగ్య నియమాలు పాటిస్తే మనకే మంచిది.
పాలకూర : వంటలు, సలాడ్లు, ఆవకాడోతో కలిపి తీసుకునే పాలకూరలో ఎన్నో అద్భుత పోషకాలున్నాయి. ఇది శక్తిమంతమైన ఆహారంలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఇ మన శరీరంలో వేడి, నొప్పులు, మంటల బాధల్ని తరిమికొడుతుంది. పాలకూర ఆకులు ఎంత ఎక్కువ గ్రీన్ కలర్తో ఉంటే, అంత ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది.
దానిమ్మ గింజలు : దానిమ్మ, దాని రుచి మనందరికీ తెలిసిందే. దానిమ్మ గింజల్లో మన శరీరంలోని విష పదార్థాలతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, బీపీని తగ్గిస్తాయి. వీటిలోని ప్యూనికాలాజిన్ అనే పదార్థం మన మెదడులోని వేడి, నొప్పులను తరిమికొడుతుంది. మెదడుకు వచ్చే మతిమరపు లాంటి సమస్యలు త్వరగా రాకుండా చెయ్యడంలో దానిమ్మ గింజలు చక్కగా పనిచేస్తాయి.
బ్లాక్ టీ : సహజంగానే బ్లాక్ టీ ప్రత్యేక రుచితో ఉంటుంది. ఇక దీనికి పాలు, తేనె, నిమ్మరసం, దానిమ్మ రసం వంటివి కలిపి తాగితే ఆ టేస్టే వేరు. గ్రీన్ టీతో కలిగే ప్రయోజనాలు బ్లాక్ టీతో కూడా కలుగుతాయి. ఇవి రెండు ఒకే జాతి మొక్క నుంచీ తయారవుతాయి. బ్లాక్ టీ తాగడం వల్ల మన బాడీలో ధమనులు తెరచుకుంటాయి. బ్లాక్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీర కణాలు పాడవకుండా కాపాడతాయి. ఇది ఒవారియన్ కేన్సర్ను కూడా అడ్డుకుంటుందని ఓ అధ్యయనంలో తేలింది.
పియర్స్ : కీళ్ల నొప్పులు, డయాబెటిస్ ఉన్నవారు, శరీరంలో మంటలతో బాధపడేవారు పియర్స్ పండును తింటే సరి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా వేడిని తగ్గిస్తుంది. ఇందులోని మైక్రోబయోమ్ అనే పదార్థం... వేడితోపాటూ, బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది.
బెల్ పెప్పర్స్ : బెల్ పెప్పర్స్ను ముక్కలుగా చేసుకొని, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని తింటారు. బెల్ పెప్పర్స్ ముఖ్యంగా ఎరుపు రంగు ఉండే వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థం తక్కువగా ఉంటుంది. స్పైసీ పెప్పర్స్ లాగానే ఇవి కూడా కాప్సాయ్సిన్ అనే రసాయనం కలిగివుంటాయి. ఇది శరీరంలో మంట, నొప్పులను మటుమాయం చేస్తుంది.
మాకెరెల్ : మధ్యదరా సముద్రంలో కనిపించే చేప ఇది. ఆలివ్ ఆయిల్లో దీన్ని బాగా వేపి, ఆకు కూరలు, నిమ్మకాయ రసం వంటివి పిండుకొని తింటారు. ఈ చేపలోని కొవ్వు, శరీరంలోని ఇన్ఫ్లమేషన్తో పోరాడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, మతిమరపు సమస్యల్ని తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ బీ12, విటమిన్ డి... మన శరీర ఎముకల్ని పటిష్టంగా చేస్తాయి. వ్యాధి నిరోధకతను పెంచుతాయి. శరీరానికి తగినంత కాల్షియం అందేలా చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇవి.
బక్వీట్ : బక్వీట్ను సోబా నూడుల్స్ తయారీలో వాడతారు. సూప్లలో కూడా వేస్తారు. ఇవి సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. వీటిని కూడా రైస్లాగా వండుకొని తినవచ్చు. బక్వీట్ మన శరీరంలో మంట, వేడి, నొప్పు, దురద, వాపు వంటివి ఉన్న చోట బ్లడ్ లెవెల్స్ను సరిచేస్తాయి. అందుకే వీటిని సీ-క్రియేటివ్ ప్రోటీన్ అంటారు. ఇందులో గ్లూటెన్ కూడా ఉండదు. అందువల్ల సెలియాక్ వ్యాధి ఉన్నవారు తినేందుకు ఇవి చక్కటి ఆప్షన్.
పై వాటిలో అన్ని పదార్థాలూ మన మార్కెట్లలో లభించకపోవచ్చు. లభించే వాటిని రెగ్యులర్గా వాడుతూ ఉంటే, చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్లవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.