సుమారు 18 నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాశ్మీర్ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆర్టికల్ 370 ని రద్దు చేసిన సమయంలో నిషేధం విధించిన 4 జీ సర్వీసెస్ పై బ్యాన్ ఎత్తేసింది. నేటి నుంచి అక్కడ టెలికాం 4 జీ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 2019లో రాజ్యాంగంలోని 370 వ అధికరణాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కేంద్రం 4 జీ సేవలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి జమ్మూ కాశ్మీర్ అంతటా 4 జీ సేవలను పునరుద్దరిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రోహిత్ కన్సాల్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
కాశ్మీర్ లో ఉదంపూర్, గండేర్బల్ లో మాత్రమే ఇంతకుముందు ఈ సేవలను పునరుద్దరించారు. మిగిలిన 18 జిల్లాల్లో 2 జీ సేవలను మాత్రమే అందిస్తున్నారు. ఇక తాజా ఉత్తర్వులతో జమ్మూకాశ్మీర్ అంతటా 4 జీ సేవలు అందనున్నాయి.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణం 370ని రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5 న అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. కాగా.. సమాచార వ్యవస్థలను దాదాపు ఆరు నెలల తర్వాత ప్రారంభించిన కేంద్రం.. దశల వారీగా ఇంటర్నెట్ ను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. సమాచార వ్యవస్థ సరిగా లేకపోవడంతో వ్యాపారస్థులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడ 4 జీ సేవలను తిరిగి ప్రారంభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Article 370, Central Government, Jammu and Kashmir, Kashmir, Kashmir Issue, Mobile