భారత ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) అనే హెల్త్ స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ఈ పథకం లక్ష్యం. అయితే ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం 25 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు (Ayushman Bharat cards) అందించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇతర కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుంచి సంక్షేమ పథకాల అప్డేటెడ్ డేటాబేస్లను కోరింది. ఈ పథకం ప్రారంభించిన దాదాపు నాలుగేళ్లు గడిచిపోతుండగా ఇప్పటివరకు సుమారు 18.5 కోట్ల మంది ప్రజలు తమ ఆయుష్మాన్ భారత్ కార్డులను పొందారు. ఈ కార్డు ద్వారా వారు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు కుటుంబ కవరేజీతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత చికిత్స పొందవచ్చు. ఎవరైనా వ్యక్తి దగ్గర కార్డు లేనప్పుడు చికిత్స చేయమని ఆసుపత్రులు మొండికేసి కూర్చోకూడదు. వ్యక్తి ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కార్డు అందించవచ్చు.
సామాజిక ఆర్థిక, కుల గణన 2011 (SECC, 2011) డేటా ప్రకారం, ఈ పథకం కింద 53 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా. "ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మేం ఆయుష్మాన్ కార్డుల సంఖ్యను 25 కోట్లకు తీసుకెళ్తాం." అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది జులైలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పథకం బాగా పాపులర్ అయింది. అప్పటివరకు, ఈ పథకం ద్వారా మూడేళ్లలో 12 కోట్ల కంటే తక్కువ మంది లబ్ధిదారులు కార్డులు పొందారు. గతేడాది కాలంలో 6.5 కోట్ల మందికి పైగా కార్డులు పొందారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 25 కోట్ల మార్కును చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే మరో ఆరున్నర కోట్ల కార్డులను కొత్తగా జారీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇతర మంత్రిత్వ శాఖల సహకారం
SECC 2011 డేటాబేస్ ఉపయోగించి PM ఉజ్వల యోజన, PM ఆవాస్ యోజన వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంప్రదించింది. మెరుగైన లక్ష్యం కోసం సంక్షేమ పథకాల అప్డేటెడ్ డేటాబేస్లను ఉపయోగించింది. SECC 2011 డేటా కాలం తీరిన, లోపాలు ఉన్న డేటా కాబట్టి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇప్పటివరకు ఈ డేటా నుంచి తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద చేరే లబ్ధిదారులను గుర్తించడం కోసం కేంద్రం, రాష్ట్రాలు కాస్త సీరియస్గా వ్యవహరిస్తున్నాయి. ఆయుష్మాన్ కార్డ్ల ఉత్పత్తి, కార్డ్ ఆమోదం కోసం అదనపు ఏజెన్సీలను చేర్చుకోవడం ద్వారా ఆయుష్మాన్ కార్డ్ ఉత్పత్తికి మార్గాలను పెంచింది ఆరోగ్య శాఖ. ప్రజలలో అవగాహన పెంచడానికి ఇతర జాతీయ ప్రధాన పథకాలతో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి కూడా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.
ఇతర లక్ష్యాలు
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటివరకు రూ.43,000 కోట్ల విలువైన దాదాపు 3.65 కోట్ల ఆసుపత్రులలో అడ్మిషన్లు నమోదయ్యాయి. దాదాపు 25,000 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకం కింద లిస్ట్ అయ్యాయి. ఏడాది క్రితం అడ్మిషన్లు 2 కోట్ల మార్కుకు చేరుకోవడంతో గత ఏడాది కాలంలో కూడా ఈ పథకం కింద అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఈ పథకంపై అవగాహన పెంచడం ద్వారా ఏటా 2 కోట్ల మందికి ఉచిత వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aayushman bharath, Health ministry, India, Nirmala sitharaman